బాన్సువాడ టౌన్, నవంబర్ 25: పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని మౌలిక వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం, ఏఏ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు.. తదితర అంశాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. ఒక మనిషి విద్యా జీవితంలో ఇంటర్మీయెట్ అనేది కీలకమన్నారు. జీవితంలో స్థిరపడడానికి అతి ముఖ్యమైన మలుపు అని పేర్కొన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా, పాడు చేసుకోవాలన్నా ఇంటర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. బైపీసీ విద్యార్థులకు పైచదువులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాలను గతేడాది బాన్సువాడ లో ప్రారంభించామని, ఎక్కువ మార్కులను తెచ్చుకుంటే ఇక్కడే సీటు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో ఎవరైనా మొదటి గ్రేడ్లో పాసైతే వారికి సన్మానం చేసేవారని, కాలానుగుణంగా ఇప్పుడు 90 శాతం పైగా మార్కులు వస్తేనే పైచదువులకు అవకాశాలు ఉంటున్నాయన్నారు. పేదరికంతో చాలా మంది మెరిట్ విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారనే ఉద్దేశంతోనే బాన్సువాడలో అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థలను ఉన్నత చదువు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బాన్సువాడ మండలపరిధిలోని హన్మాజీపేట్ ప్రాంతంలో మరో గిరిజన మహిళా వసతి గృహం ఏర్పాటుకు అనుమతి లభించిందని, ఈ పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కమిషనర్ కల్యాణం రమేశ్, సభాపతి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి, నాయకులు నార్ల ఉదయ్ తదితరులు ఉన్నారు.