మెండోరా, మార్చి 19 : విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమూల మార్పుల ఫలితాలు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్పేట్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రైవేటును తలదన్నే విధంగా పాఠశాలలో వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమ బోధనతో పిల్లల తల్లిదండ్రులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. సర్కారు బడిని కాపాడుకోవాలనే సంకల్పంతో గ్రామస్తులు చేసిన కృషి సత్ఫలితాన్నిచ్చింది. ప్రైవేటుకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టడం కన్నా ఉన్న ఊరిలోని ప్రభుత్వ బడిలో సంస్కరణలు చేపడితే ఉచితంగానే ఇంగ్లిష్ మీడియం చదువుకోవచ్చనే ఐక్యతా రాగం ఈ బడిని మార్చివేసింది. నాడు విద్యార్థులు లేక బోసిపోయిన పాఠశాల ప్రస్తుతం పెరిగిన విద్యార్థుల సంఖ్యతో కళకళలాడుతున్నది.
ఆంగ్లం ప్రారంభంతో తిరిగి వచ్చారు..
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్పేట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరానికి కేవలం 22 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించేవారు. ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండడంతో గ్రామస్తులంతా కలిసి బడిని కాపాడుకోవాలని సంకల్పించారు. ఊర్లో ఉన్న సర్కారు బడిని వదిలి పెద్ద సంఖ్యలో పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడంపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం బోధన మాత్రమే ఉండడం, వసతులు, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలుగా గుర్తించారు. గ్రామాభివృద్ధి కమిటీతోపాటు గ్రామస్తులంతా కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడు ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు సొంతంగా నలుగురు ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థులకు కావాల్సిన గదులను పరిశీలించి, పాఠశాల భవనానికి రంగులు వేయించారు. దీంతో ప్రభుత్వ బడిలో విద్యార్థుల చేరిక మొదలైంది.
ఇంగ్లిష్ మీడియంతో మెరుగైన ఫలితాలు…
ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తుండడంతో ప్రైవేటుకు వెళ్లిన పిల్లలంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఉపాధ్యాయులు సైతం ప్రైవేటును తలదన్నేలా బోధిస్తుండడంతో 2016-17 సంవత్సరంలో 22 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల ప్రస్తుతం 110 విద్యార్థులతో నిండుగా మారింది. ఆంగ్ల మాధ్యమ బోధనతో ఐదేండ్లలో పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు, ముగ్గురు విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికయ్యారు.
మన ఊరు – మన బడితో మరింతగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు – మనబడి కార్యక్రమంతో సోన్పేట్ పాఠశాల మాదిరిగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పిస్తుండడంతో విద్యాబోధన మరింత మెరుగుపడుతుంది.
ఇంగ్లిష్తో విద్యార్థులు ఫుల్
సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి పేరుతో విద్యాభివృద్ధికి కృషి చేయడం హర్షణీయం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు బోధన మారాలి. ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో ప్రైవేటుకు వెళ్లే విద్యార్థులను తల్లిదండ్రులు ఇక్కడే చేర్పిస్తారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
-గోలి ప్రకాశ్, సర్పంచ్