ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముసురు అలుముకుంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీజన్ ప్రారంభమైన రెండో నెలకే పెద్ద ఎత్తున వర్షాలు పడడం అరుదుగా చూస్తున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వానలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు ఉప్పొంగి ప్రవహించాయి. అంతేకాకుండా భారీ ప్రాజెక్టులు సైతం గేట్లు తెరుచుకుని వరదను దిగువకు వదులుతున్నాయి. తాజాగా వీటి సరసన చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు సైతం వచ్చి చేరింది. మొన్నటి భారీ వానలతో నిండుకుండలా మారిన ప్రాజెక్టు కాస్తా శనివారం గేట్లు తెరుచుకుని జలకళతో ఉట్టి పడింది. గతేడాది మాదిరిగానే నిజాంసాగర్కు వరద పోటెత్తడంతో ఆయకట్టు రైతులు సంబురపడుతున్నారు. మూడేండ్ల క్రితం వరకు బోసిపోయిన ప్రాజెక్టు వరుసగా జల సవ్వడులు సంతరించుకోవడంతో రైతుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.
కామారెడ్డిలో జోరు వాన..
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వానలతో వాగులు, వంకలు 24గంటల్లోనే మరోసారి ఉప్పొంగి ప్రవహించడం కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతోపాటు పలు చెరువులు అలుగులు పోశాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగిరెడ్డిపేట్లో కుండపోత వానలు కురిశాయి. ఏకంగా 18.89 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో ఇంత భారీగా వానలు కురవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రాజంపేటలో 12.03 సెం.మీ, ఎల్లారెడ్డిలో 11.23 సెం.మీ, లింగంపేటలో 9సెం.మీ, పిట్లంలో 7.5 సెం.మీ, గాంధారిలో 7.3 సెం.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు వానలు కురుస్తున్నాయి. అత్యధికంగా మాక్లూర్ మండలం మదనపల్లిలో 4.63 సెం.మీ, నిజామాబాద్ నార్త్, సిరికొండ – తూంపల్లిలో 4.23 సెం.మీ, డిచ్పల్లిలో 4సెం.మీ, వర్ని – జకోరాలో 3.80 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవగా కనిష్ఠంగా ముప్కాల్, ఆర్మూర్, నందిపేటలో 9మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. మిగిలిన అన్నిచోట్లా కనిష్ఠంగా 2సెంటీమీటర్ల కన్నా ఎక్కువే వర్షం కురిసింది.
ఎగువ ప్రాంతంలో మంజీరా నదిపై నెలకొన్న సింగూర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తారు. దీంతో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతూ సంగారెడ్డి, మెదక్ జిల్లా మీదుగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే చారిత్రక ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లను ఎత్తివేశారు. 17.802 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్ ప్రాజెక్టులో 16.02 టీఎంసీల మేర నీటి నిల్వతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. 1405 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం కాగా 1404 అడుగులు నీటిమట్టానికి వరద చేరడంతో 8 గేట్ల ద్వారా 54 వేల క్యూసెక్కులు మంజీరలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ గేట్లను ఎత్తడంతో పరీవాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో జలదిగ్బంధనంలో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా సమాచారం చేరవేశారు. ఈ జలాలు కాస్తా కందకుర్తి వద్ద గోదావరితో సంగమించనున్నాయి.
బిచ్కుంద మండలం చేట్లూర్ గ్రామానికి చెందిన గైనీ శ్రీనివాస్ శనివారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం మంజీర నది అవతలి వైపునకు వెళ్లాడు. పనులు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో కౌలాస్నాలా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో అక్కడే ఉండిపోయాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో శ్రీనివాస్ను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేట్లూర్కు చేరుకొని శ్రీనివాస్ను పరామర్శించారు. మరో రెండు రోజుల పాటు గ్రామస్తులెవరూ మంజీర నదిని దాటొద్దని కోరారు. తహసీల్దార్ రవికాంత్, ఎస్సై శ్రీధర్రెడ్డి, ఎంపీపీ అశోక్ పటేల్, అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఉన్నారు.