బోధన్, జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని వైకుంఠధామాల్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ వార్డుల్లోని 18 వైకుంఠధామాల్లో పూర్తి స్థాయిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వైకుంఠధామాలను మున్సిపల్ కమిషనర్ జి.రామలింగం, డీఈఈ లింగంపల్లి శివానందం ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లతో కలిసి వైకుంఠధామాలను మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. పట్టణంలోని 18, 22, 24 వార్డుల్లోని వైకుంఠధామాలను ఆదివారం పరిశీలించారు.
వైకుంఠధామాల్లో ఖాళీగా ఉన్న స్థలాలతోపాటు, మొక్కల సంరక్షణకు గాను నీటి వసతి తదితర అంశాలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్శాఖకు కేటాయించిన లక్ష్యం పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతీ వైకుంఠధామంలో పచ్చని చెట్లతోపాటు పూలమొక్కలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. వార్డుల వారీగా బోధన్ పట్టణంలో ఉన్న వైకుంఠధామాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపడతామని కమిషనర్ వివరించారు. వార్డుల వారీగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కౌన్సిలర్లు, ప్రజలు సహకరించాలని, నాటిన మొక్కలను సంరక్షించేందుకు కూడా బాధ్యత వహించాలని ఆయన కోరారు.