ధర్పల్లి, మే 19 : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ ప్రణాళిక, ఆర్థికసంఘం సభ్యుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ధర్పల్లి, ప్రాజెక్టు రామడ్గు, హొన్నాజీపేట్ సహకార సొసైటీల్లో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డితో కలిసి రైతులకు జీలుగ విత్తనాలను జగన్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పంటల సాగులో సేంద్రియ ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. అనంతరం వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి కోటా నిధుల నుంచి గ్రామంలోని పాఠశాల, దవాఖాన ఆవరణలో చేపట్టనున్న బోరుతవ్వకం పనులను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సొసైటీ చైర్మన్లు ధర్మయ్యగారి రాజేందర్రెడ్డి, చెలిమెల చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, ఏవో ప్రవీణ్, కేశారం సర్పంచ్ సంగీతాభాస్కర్, సొసైటీ వైస్చైర్మన్ తూటికూర నర్సారెడ్డి, ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, నాయకులు పుప్పాల సుభాష్, దుమాల దత్తాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మోస్రాలో..
మోస్రా (చందూర్), మే 19 : మోస్రా మండల కేంద్రంలో సహకార సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గుత్ప జగన్మోహన్రెడ్డి రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి ప్రశాంత్, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.