నిజామాబాద్ సిటీ: పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడుల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోనా నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ 16 నెలల తరువాత బడులు ప్రారంభం అయ్యాయని కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిచోట కొవిడ్ నిబంధనలు అన్ని స్కూళ్లలో అలవాటు చేయాలని పేర్కొన్నారు. శనివారం వరకు మండల స్పెషల్ అధికారులు, క్లస్టర్ అధికారులు స్కూళ్లను తనిఖీ చేసి రిపోర్టు సమర్పించాలన్నారు. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు అలవాటు అయ్యేలా టీచర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వారిని తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు.
ప్రతి టీచర్, పిల్లలు తప్పక మాస్కులు ధరించాలని, టీచర్లు సిలబస్, టీచింగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. టీచర్లు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, క్లస్టర్గా ఏర్పడి ప్రతిస్కూల్ను పరిశీలించాలన్నారు. పాఠశాలల్లో విద్యుత్ సరఫరా లేకుంటే వాటి వివరాలను డీఈవోకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, డీఈవో దుర్గాప్రసాద్, డీపీవో జయసుధ, అగ్రికల్చర్ జేడీ గోవింద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.