నిజామాబాద్ సిటీ, నవంబర్ 11 : ఉమ్మడి జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించిన అనుభవం మనందరికీ ఉందని, రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో ఈసీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించే విధంగా బందోబస్తు, పర్యవేక్షణతో పాటు, రాజకీయపరమైన ఫ్లెక్సీలు, బ్యానర్లు, రాతలు ఉంటే పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఇన్డోర్, అవుట్డోర్ సమావేశాలకు అనుమతి ఉందని, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని అన్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ నెల 16 తేదీ నుంచి ఆయా బృందా లు తనిఖీల వివరాలను ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్తోనే ఎన్నిక ఉంటుందని రెండు జిల్లాల పరిధిలోని ఆరు డివిజన్ కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. వసతులు అనుకూలంగా ఉన్న కేంద్రాలను ఎంపిక చేయాలని సూచించారు. వచ్చేవారం నుంచి ఎన్నికల సిబ్బందికి శి క్షణ అందించాలని, రెండు విడుతల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఎన్నికల విధులు నిర్వహించాలని సూ చించారు. ఈ సమావేశంలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నిజామాబాద్ అదనపు డీసీపీ అరవింద్బాబు, అధికారులు పాల్గొన్నారు.