స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నగారా మోగింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి 4తో ముగియనున్నది. దీంతో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. వెనువెంటనే ఉమ్మడి జిల్లాలో ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు.
నిజామాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రాష్ట్రంలో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం కూడా ఉండడంతో ఉభయ జిల్లాల్లో రాజకీయ సందడి మొదలవ్వనుంది. అనేక వాయిదాలు, అవంతరాలతో గతేడాది అక్టోబర్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్సీగా కవిత పదవీ కాలం జనవరి 4నాటికి ముగుస్తుండడంతో ఎన్నికల కమిషన్ ఈ మేరకు పో లింగ్కు సిద్ధమైంది. మంగళవారం విడుదలైన షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఆయా రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం దాదాపు 8 రోజుల సమయాన్ని కేటాయించింది. నవంబర్ 26న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. డిసెంబర్ 10న స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడి అవుతాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 824 మంది ఓటర్లున్నారు.
అమల్లోకి ఎన్నికల కోడ్…
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ నియోజకవర్గం ఉండడంతో ఉమ్మడి జిల్లా మొత్తం కోడ్ వర్తించనున్నదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటుగా అధికారిక కార్యక్రమాలేవీ నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 824 మంది ఓటర్లుండగా వీరిలో సంఖ్యా బలం అధికార టీఆర్ఎస్ పార్టీకే ఉంది. గతేడాది నిర్వహించిన ఉప ఎన్నికలతో కాం గ్రెస్, బీజేపీల బలం మరింతగా బలహీనమైంది. గత ఉప ఎన్నికల్లో బరిలో నిలిచి పరువు పోగొట్టుకున్న ఇరు పార్టీలు ఇప్పుడు పోటీ చేస్తాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఓ వైపు కరోనా… మరోవైపు వాయిదాలు..
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా 2015, డిసెంబర్ 12న టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఫిరాయించడంతో తెలంగాణ శాసన మండలి ఆయనపై 2019, జనవరి 16న వేటు వేసింది. ఆయన కోర్టులను ఆశ్రయించడంతో ప్రతికూల తీర్పు వ చ్చింది. చివరికి సుప్రీం కోర్టు తలు పు లు తట్టినా ఫలితం లేకుండా పోయింది. 2020, జనవరి లో అనర్హత సబబేనంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పునివ్వడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) 2020, మార్చి 5న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 7న పోలింగ్ తేదీగా ప్రకటించింది. అంతలోపే దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసింది. ఇలా వాయిదాలు పడుతూ వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎట్టకేలకు గతేడాది అక్టోబర్లో నిర్వహించగా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 2020లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చారిత్రక విజయం సొంతం చేసుకున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు ప్రతినిధిగా మండలిలో కల్వకుంట్ల కవిత అడుగు పెట్టా రు. ఏ మాత్రం సంఖ్యా బలం లేని కాంగ్రెస్, బీజేపీలకు సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే గట్టి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 88శాతం ఓట్లు రావడం విశేషం. అక్టోబర్ 12, 2020న ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని కవిత దక్కించుకున్నారు. మొత్తం 824 ఓటర్లకు 821 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో 728 ఓట్లు కవిత(టీఆర్ఎస్)కు రాగా, 56 ఓట్లు పోతన్కర్ లక్ష్మీనారాయణ(బీజేపీ)కు, 29ఓట్లు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి(కాంగ్రెస్)కి దక్కాయి. కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్ సైతం గల్లంతు కాగా… కల్వకుంట్ల కవిత అపూర్వ మెజార్టీతో చరిత్ర సృష్టించారు. 2020, అక్టోబర్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు శాసన మండలిలో ప్రతినిధిగా నిలిచారు. రానున్న జనవరి 4 నాటికి కవిత పదవీ కాలం ముగియనున్నది.
అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమాళి
నిజామాబాద్ సిటీ, నవంబర్ 9: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వచ్చిందని అధికారులు ఈ దిశగా అన్ని చర్యలుతీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో మంగళవారం సెల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో ఎటువంటి కొత్త కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టవద్దని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, సంస్థల్లో రాజకీయపరమైన రాతలు, ఫ్లెక్సీలు, ఫొటోలు ఉంటే వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల అనుమతి లేకుండా రాజకీయపరమైన ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు.