వాతావరణ మార్పులతో పెరిగిన చలి తీవ్రత
18 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
జిల్లావ్యాప్తంగా కమ్ముకుంటున్న పొగమంచు
ఖలీల్వాడి, డిసెంబర్ 4: నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఊహించని విధంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి ప్రభావంతో ఇంట్లోనుంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, శాలువాలను ఆశ్రయిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని మండలాల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచే మంచుకురుస్తోంది.