యాసంగిలో వరి కొనుగోలు చేస్తారా లేదా, చేస్తే ఎంత కొంటారు అనేది స్పష్టం చేయాలని కేంద్రాన్ని రైతుల తరఫున టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. రైతన్న కూడా సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ డిమాండ్పై కేంద్రం స్పందన కోసం ఎదురు చూశాడు. రైతుల తరఫున వచ్చిన ఈ డిమాండ్కు సమాధానం చెప్పాల్సిన బీజేపీ నాయకత్వం మాత్రం కేంద్రంలో ఒక రకంగా.. తెలంగాణలో మరో రకంగా మాట్లాడుతూ రైతులను మరింత గందర గోళానికి, ఆందోళనకు గురి చేస్తున్నది.
-కమ్మర్పల్లి, డిసెంబర్ 2
ఢిల్లీలో బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు వరికి బదులు ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ వరి కొనాలని రైతు చేస్తున్న డిమాండ్ పై మాత్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరి వేయాలని చెప్పడం, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కేంద్రం నుంచి వరి కొనుగోలుపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయిస్తాననే మాట మాట్లడకపోవడాన్ని రైతులు గమనిస్తున్నారు. యాసంగిలో పండించే వరిని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని మాత్రం ఎందుకు చెప్పడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో వరి సాగు ఎప్పుడూ ప్రధానంగా జరుగుతూ వస్తున్నదే. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. ప్రాజెక్టులకు నీటి భరోసా కల్పించింది. కొత్త ఎత్తిపోతలు నిర్మించి..అలంకార ప్రాయంగా ఉన్న ఎన్నో వాటిని వినియోగంలోకి తెచ్చింది. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేయించి, ఎస్సారెస్పీ వరద కాలువను, కాకతీయ కాలువను మూడు కాలాలు సాగు నీటితో నిండుగా ఉండేలా మార్చడంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంటును, పంట పెట్టుబడిని అందిస్తూ ఉండడంతో జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. దీంతో యాసంగిలోనూ వరి పండిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో యాసంగి ధాన్యం కొనబోమన్న కేంద్రం ప్రకటనలు జిల్లా రైతు మీద పిడుగులా పడ్డాయి. ఇలాంటి ఆపదలో రైతుకు అండగా నిలిచిన టీఆర్ఎస్ను చూస్తున్న అన్నదాతలు బీజేపీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తున్నదో కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోలు విషయంలో బీజేపీ తత్వం రైతన్నకు స్పష్టంగా బోదపడుతున్నది.
అడుగడుగునా బీజేపీ కుట్రలు..
రైతుల మీద, తెలంగాణలో సాగు మీద జరుగుత్ను కుట్రలను ఎండగడుతూనే రైతన్నకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర సర్కారు అప్రమత్తమై తగిన చర్యలకు ఉపక్రమించింది. అటు చూస్తే కేంద్రం వరి కొనుగోలు చేసేలా కనిపించడం లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్కు కేంద్రంతో యాసంగి వరి కొనుగోలు చేయించే సత్తా లేదని అవగతమవుతున్నది. పైగా వరి వేయండని చెబుతూ ఉన్నారు. వీరి వైఖరితో రైతన్న తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని గుర్తించి వరికి బదులు ఇతర పంటలు వేసుకునేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నది. వరిని కొనేది కేంద్రం పరిధిలోని ఎఫ్సీఐ మాత్రమేనని, కొన్న ధాన్యాన్ని నిల్వ చేసే భారీ గోదాముల వ్యవప్థ వారికి మాత్రమే ఉంటుందని వివరిస్తున్నది. అలాంటిది వారే కొనబోమని చెబుతున్నప్పుడు యాసంగిలో వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతామని వివరిస్తూ ప్రత్యామ్నాయ, ఆరు తడి పంటల సాగు చేయాలని రైతన్నకు ఈ ఆపద సమయంలో అనుసరించాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తున్నది. వరి కొనబోమన్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సైతం నీరు గార్చేలా రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో వరి సాగు చేయాలనే ప్రకటనలు చేయిస్తున్నదని రైతులు గుర్తిస్తున్నారు.
ఇక్కడో మాట.. అక్కడో మాట..
జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు పై బాండ్ పేపర్ హామీతో ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ తమను మోసం చేశాడని..రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు యాసంగి వరి విషయంలో అర్వింద్ వైఖరితో మరింత అసంతృప్తికి గురవుతున్నారు.యాసంగిలో వరి కొంటారా లేదా, కొంటే ఎంత కొంటారు అనేది తక్షణం స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ చేస్తున్న డిమాండ్కు తమ కేంద్ర నాయకత్వం నుంచి సమాధానం చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేంద్రం వరి మీద, తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో నిత్యం పోరాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాలతో వరి రైతుకు స్పష్టమైన విధానంతో అండగా నిలుస్తున్నారు. జిల్లాలో సైతం మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి బీజేపీ , కేంద్రం ప్రభుత్వం పై నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ రైతుకు అండగా నిలిస్తే బీజేపీ నాయకులు మాత్రం ఢిల్లీలో ఓ తీరు..గలీల్లో మరో తీరుగా మాట్లాడుతూ తమ రాజకీయ దివాళాకోరు తనాన్ని చాటుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పసుపు బోర్డు పై అర్వింద్ చేసిన బండ్ పేపర్ రాజకీయం, బీజేపీ అగ్ర నాయకులు రాంమాధవ్, అంతకు ముందు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పసుపు రైతులకు రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన హామీ తదితర అంశాలు జిల్లా రైతుల్లో బీజేపీపై అసంతృప్తిని భారీగా పెంచాయి. ఇప్పుడు యాసంగి వరి కొనుగోలు విషయంలోనూ అర్వింద్, జిల్లా బీజేపీ నేతల వైఖరి ్ల రైతుల్లో మరింత అసంతృప్తిని నింపుతున్నది.