నవీపేట, డిసెంబర్ 2: ఫత్తేనగర్లో కొన్నేండ్లుగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్న భూముల సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. గురు వారం మండల కేంద్రంలో కవితక్క, షకీల్ అన్న కార్యాలయం, శివతండా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవాల అనంతరం ఫత్తేనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సైనికులకు కేటాయించిన 1400 ఎకరాల భూములకు పట్టాలు లేని విషయం తన దృష్టికి వచ్చిందని, విషయాన్ని సీఎంకు వివరించి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నవీపేట నుంచి లక్ష్మీకిసాన్ఫారం వరకు ఉన్న బీటీ రోడ్డు విస్తరణ కోసం 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన నవీపేటలో కవితక్క, షకీల్ అన్న యువసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, జడ్పీటీసీ నీరడి సవిత, సర్పంచ్ ఆసీఫా ఖాతున్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మువ్వా నాగేశ్వర్రావు, దొంత ప్రవీణ్కుమార్, నవీపేట సర్పంచ్, ఉపసర్పంచులు ఏటీఎస్ శ్రీనివాస్, కరిపె మల్లేశ్, ఎంపీటీసీ లావణ్య, నాయకులు వి.నర్సింగ్రావు, తెడ్డు పోశెట్టి, హరీశ్, న్యాలకంటి అబ్బన్న, ఎంఏ రజాక్, నీరడి బుచ్చన్న, కవితక్క, షకీల్ అన్న యువసేన మండల అధ్యక్ష, కార్యదర్శులు గైని సతీశ్, ఈర్నాల స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నవీపేటలోని ప్రభుత్వ దవాఖానను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. దవాఖానలోని వార్డుల్లో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇంకా కొవిడ్ వ్యాక్సినేషన్ ఎందుకు పూర్తి కాలేదని వైద్యురాలు తరుణ్నాజ్ను ప్రశ్నించారు. మరో ఇద్దరు వైద్యులను నియమించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రోగులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు.