నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, నవంబర్ 1: నెలాఖరులోగా రెండు డోసుల వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య, మున్సిపల్, విద్యా శాఖల మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వ్యాక్సినేషన్పై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, వైద్య, మున్సిపల్శాఖ అధికారులతో వారు మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని థర్డ్వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు రెండు డోసుల టీకాలు తీసుకోవడంతోపాటు కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు భాగస్వాములు కావాలని మంత్రులు కోరారు. కరోనా రెండు విడుతల్లోనూ చాలామంది కేవలం భయంతోనే ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. థర్డ్ వేవ్పై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ధైర్యంగా ఉండేవిధంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టోల్ఫ్రీ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 95 శాతం, విద్యార్థులు 50 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురుకులాల్లో వైరస్ వ్యాప్తిచెందకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వీసీలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మేయర్ నీతూకిరణ్, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మ, కామారెడ్డి అదనపు కలెక్టర్లు వెంకటేశ్, మాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, కమిషనర్లు దేవేందర్, రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెతులెత్తి దండం పెడతా టీకా తీసుకోండి : నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 1: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదం పొంచిఉందని, ‘చేతులెత్తి దండం పెడుతున్నా.. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోండి’ అంటూ నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు ఒక సందేశం పంపారు. జిల్లాలో ఇంకా లక్షన్నర మంది మొదటిడోస్ తీసుకోలేదని తెలిపారు. వ్యాక్సిన్తో రోగనిరోధకశక్తి పెరిగి థర్డ్వేవ్ను కూడా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. లేదంటే ప్రాణాలకే ముప్పు తెచ్చుకొని కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చినవారమవుతామని తెలిపారు.