యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ కర్షకులను సన్నద్ధం చేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరుతో వరిసాగును తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. వరిసాగు చేసి ఇబ్బందులు పడకుండా రైతుల మేలుకోరి అవగాహన కల్పిస్తున్నది.ఈ నేపథ్యంలో ఎప్పటికీ డిమాండ్ ఉండే పప్పుధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు
అన్నదాతలకు సూచిస్తున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి) : యాసంగిలో వరి సాగును తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు పండించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాగులో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు. రోజురోజుకూ నిస్సారమవుతున్న భూములకు పూర్వపు స్థితి తీసుకురావడానికి అపరాల సాగు ఎంతో మేలు చేస్తుంది. తక్కువ కాల పరిమితి, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంచుకోవాలి. అపరాలను వర్షాధార, నీటి పారుదల కింద ఎక్కువ ఎడములో పండించే పత్తి, ఆము దం, జొన్న, సజ్జ తదితర పంటగా… అంతర పంట గా, మిశ్రమ పంటగా సాగు చేయవచ్చు. దుక్కిలో భాస్వరం ఎరువులు వేయడం, విత్తన శుద్ధి చేయడం, రైజోబియం కల్చరు విత్తనానికి కలిపి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందడానికి వీలుంటుంది. పప్పు ధాన్యాల పంటలను సారవంతమైన నేలలో సాగు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని పొందొచ్చు. రైతులు పప్పు ధాన్యాల సాగు పద్ధతులను పూర్తిగా తెలుసుకొని సరైన సమయానికి పంటను విత్తుకోవడం సరైన ఎరువులు వేయడం, కలుపు, నీటి యాజమాన్యం చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు.
అపరాల సాగు అద్భుతం…
అపరాల సాగులో రైతులు అద్భుతాలు సృష్టించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలకు డిమాండ్ ఎప్పటికీ ఉండడం మూ లంగా వీటి సాగుతో స్థానికంగానే రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. వరి సాగుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న ప్రస్తుత పరిస్థితిలో పప్పు ధాన్యాలు సాగు చేసి భూములను బలోపేతం చేసుకోవడంతో పాటు అధిక సంపాదనను పొందొచ్చని వ్యవసాయ శాఖ చెబుతున్నది. శనగ, వేరుశనగ, మినుముల్లో వివిధ రకాల మేలైన విత్తనాలు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయి. శనగ విత్తనాల్లో అనేక రకాలున్నాయి. జేజీ 11, జేఏకేఐ 9218, నంద్యాల శనగ 1, శనగ 47, విహార్, కేఏకే, నంద్యాల శనగ 810 రకాలు విత్తుకోవడానికి మేలైనవి. డిసెంబర్ ప్రా రంభంతోనే విత్తుకుంటే మంచిది. వేరుశనగ విత్తనాల్లో కదిరి 6, 1812, టీఏజీ 24 విత్తన రకాలు మేలైనవి. పెసర ఎమ్జీజీ 295, డబ్ల్యూజీజీ 37, టీఎమ్ 96-2, ఎమ్జీజీ 347, 348, 351 రకాలు సాగుకు అనుకూలం. మినుముల్లో ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623, డబ్ల్యూబీజీ 26, ఎంబీజీ 207, పీయూ 31, ఎల్బీజీ 787 విత్తన రకాలు అధిక దిగుబడులకు మంచివని సాగు నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి…
మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే 18 రకాల పోషకాలు అవసరం అవుతాయి. నత్రజని, భా స్వరం, పొటాషియం, ప్రధాన పోషకాలుగా కాల్షి యం, మెగ్నీషియం, గంధకం, ఉప పోషకాలుగా ఉంటాయి. జింక్, రాగి, ఇనుము, మాంగనీస్, క్లోరిన్ సోడియం కోబాల్డ్ తదితర సూక్ష్మ పోషకాలూ అవసరం. పంటల వారీగా వేటి లోపం ఉంటే వాటిని వేయడంతో ఆశించిన దిగుబడి సాధించవచ్చు. దీంతో పాటు పప్పు ధాన్యాల సాగులో పలు జాగ్రత్త చర్యలను రైతులు పాటించా ల్సి ఉంటుంది. పప్పు ధాన్యాల సాగులో తరచూ కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. కీలక దశలో అధిక నీటి ఎద్దడికి, ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురవుతుంటాయి. అసాధారణ, అసమాన వర్షాలతో ఎద్దడికి, నీటి ముంపునకు పంట గురవుతుంది. సారవంతం కాని నేలల్లో అపరాలను పండించడంతో తక్కువ దిగుబడులు వస్తుంటా యి. అధిక ఉత్పాదక రకాలు లేకపోవడం, కలుపు మొక్కలను సరైన సమయంలో నివారించకపోవడం పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించడం, కోత తర్వాత గింజ నిల్వ సమయంలో పురుగులు ఆశిస్తున్నాయి. ముందు నుంచే సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించొచ్చు.
వరి జోరు తగ్గాలి… ప్రత్యామ్నాయం పెరగాలి…
వచ్చే యాసంగిలో రైతుకు నీటి ఢోకా లేదు. ఎక్కడ చూసినా జలాశయాల్లో పుష్కలంగా జల వనరులున్నాయి. నిరంతర కరెంట్ సరఫరా ఉండడంతో రైతన్నలంతా తమ భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు ఆవహించిన ప్రస్తుత దుస్థితిలో వరి పంటల సాగు జోరును తగ్గించడమనేది అనివార్యం. ఇతర పంటలను సాగు చేయడం ద్వారానే రైతులు బహుళ ప్రయోజనాలు పొందే వీలుంది. నిజామాబాద్ జిల్లాలో 2021 వానకాలంలో 4లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. సాధారణ వరి విస్తీర్ణం 2లక్షల 86వేల ఎకరాలు కాగా 130 శాతం మేర వరి పంటను రైతులు సాగు చేశారు. పప్పు దినుసుల సాగులో పెసర్లు 443 ఎకరాల్లో, మినుములు 565 ఎకరాల్లో, కంది 6219 ఎకరాల్లో, 26,657 ఎకరాల్లో మక్కజొన్న సాగయ్యాయి. సోయాబీన్ 63,842 ఎకరాల్లో, పత్తి 2,546 ఎకరాల్లోనే సాగైంది. ఇప్పుడీ పరిస్థితులన్నీ తారుమారు కానున్నాయి. వందల ఎకరాల్లో ఉన్న పప్పు దినుసుల సాగును వేల ఎకరాలకు తీసుకెళ్లేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం అవుతోంది. అపరాల సాగుతో కలి గే లాభాలను రైతులకు వివరిస్తూ వారిలో చైతన్యం కల్పించబోతున్నారు. వరికి బైబ్యాక్ ఒప్పందం చేసుకుని ఉంటే మాత్రం సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బైబ్యాక్ ఒప్పందాలు లేని వారు వరి సాగు చేయొద్దని అవగాహన కల్పిస్తున్నారు.
పప్పు ధాన్యాల సాగుతో అధిక లాభాలు…
వరి పంట సాగుతో అనేక నష్టాలను రైతులు ఎదుర్కొంటున్నారు. అత్యధిక మంది ఒకే పంటను వేయడం ద్వారా డిమాండ్ నెలకొనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా రైతులంతా వరికి బదులుగా ఇతరత్రా పంటలను సాగు చేసుకోవాలి. ముఖ్యంగా సారవంతమైన భూముల్లో పప్పు ధాన్యాలను సాగు చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతులకు పంటల సాగు విషయంలో అనుమానాలుంటే స్థానికంగా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.