పెద్దపల్లి రూరల్ : పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్తూ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పెళ్లై ఐదు నెలలు కూడా గడవకముందే మరణించడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పెద్దపల్లి ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్(28). వృత్తిరీత్యా సింగరేణిలో సబ్ కాంట్రాక్టర్. నాలుగు నెలలక్రితం బెల్లంపల్లికి చెందిన సౌజన్యను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజల క్రితం భార్య సౌజన్య తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది.
కాగా, తన భార్యను తీసుకువచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం బైక్పై మల్యాల నుంచి బయలుదేరాడు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట శివారుకు రాగానే పెద్దపల్లి వైపు నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు ఎదురుగా వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం పెద్దపల్లి దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజమల్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.