న్యూఢిల్లీ: థామస్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి న్యూజిలాండ్ వైదొలిగింది. ఈనెల 8 నుంచి బ్యాంకాంక్ వేదికగా ప్రారంభం కానున్న 32వ ఎడిషన్లో కరోనా వైరస్ కారణంగా న్యూజిలాండ్ షట్లర్లు పాల్గొనలేకపోతున్నారు. ప్రాతినిధ్యం వహించాల్సిన జాతీయ జట్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. పలువురు షట్లర్లకు పాజిటివ్ తేలింది. న్యూజిలాండ్ స్థానాన్ని అమెరికా భర్తీ చేయనుంది. అమెరికా జట్టు గ్రూపు-డి నుంచి బరిలోకి దిగనుంది. ‘థామస్ కప్ ఫైనల్స్ నుంచి న్యూజిలాండ్ జట్టు ఉపసంహరించుకుంది. ఆ స్థానంలో అమెరికా జట్టు పాల్గొంటున్నది’ అని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఒషియానియా చాంపియన్షిప్లో కివీస్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ సమయంలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అనంతరం జట్టులోని మరికొందరికి కూడా వ్యాపించడంతో ఈ టోర్నీకి వారు దూరమయ్యారు.