అర్హులకు దరఖాస్తు అవకాశం కల్పిస్తాం మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): నెల రోజుల్లో కొత్త పింఛన్లు ఇస్తామని, అర్హత గల వారికి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పద్దుపై మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల ముఖచిత్రం మారిపోయిందని చెప్పారు. గతంలో తెలంగాణలో 8,690 గ్రామపంచాయతీలు ఉండగా వాటిని 12,760కి పెంచుకొన్నట్టు తెలిపారు. 3,146 తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీజేపీ రాష్ర్టాల కంటే తెలంగాణలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చాలా రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు అత్యధిక నిధులు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుందని తెలిపారు. రూ. 67.40 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 13,650 ఎకరాల్లో 18,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేస్తే.. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలోనే రూ.58,303 కోట్లను ఖర్చు చేసినట్టు స్పష్టంచేశారు. దీనికి మిషన్ భగీరథ నిధులు అదనమని తెలిపారు.