హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధరణిలో ప్రభుత్వం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్న రైతులకు వాటిని విలీనం చేసే అవకాశం కల్పించింది. ఒక రైతుకు వేర్వేరు ప్రాంతాల్లో భూములు ఉంటే.. గతంలో వేర్వేరుగా ఖాతాలను మంజూరు చేశారు.
ఆధార్ అనుసంధానం, క్రయవిక్రయాల సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాతాల విలీనానికి అవకాశం ఇవ్వాలని రైతులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిటిజన్ లాగిన్లో ప్రత్యేకంగా ‘అప్లికేషన్ ఫర్ ఖాతా మెర్జింగ్’ పేరుతో మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘న్యూ రిక్వెస్ట్’ అనే ఆప్షన్ను ఎంచుకొని.. ఏయే సర్వే నంబర్లలో ఉన్న ఖాతాలను విలీనం చేయాలో వివరాలు నమోదు చేస్తే అవి నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్తాయి.