హైదరాబాద్ : దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా అదనపు విధివిధానాలను ప్రకటించింది. ఎస్సీ అభివృద్ధి, సంక్షేమశాఖ అదనపు విధివిధానాలను శనివారం జారీ చేసింది. లబ్ధిదారులకు కేటాయించే రూ.10లక్షల నిధులతో సాధ్యమైతే రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి పెద్ద యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. యూనిట్ల ఎంపిక పూర్తయ్యాక ఆయా రంగాల్లో లబ్ధిదారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రెండు వారాల నుంచి ఆరు వారాల్లోపు శిక్షణ ఉండనుంది. అవసరమైతే లబ్ధిదారులను ప్రభుత్వమే వివిధ ప్రాంతాల్లో పర్యటనకు తీసుకెళ్లనుంది. ఆయా రంగాల్లో విజయవంతమైన వారితో లబ్ధిదారులకు అవగాహన కల్పించనుంది.