హైదరాబాద్, జనవరి 23 : పాఠశాల.. ఓ వికాస కేంద్రం. విద్యార్థి సమగ్రంగా ఎదిగేందుకు తోడ్పాటు నందించే ఆలయం. ఈ ఆలయానికి కొత్త రూపాన్ని ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు చేపట్టిన యజ్ఞమే మన ఊరు.. మన బడి కార్యక్రమం. ఇవి సర్కారు స్కూళ్లేనా? అని ఆశ్చర్యపోయేలా కొత్త కాంతులతో విజ్ఞాన సౌరభాలు పంచేలా మూడు విడతల్లో.. మూడేండ్లలో రాష్ట్రంలోని 26 వేల స్కూళ్ల రూపురేఖలను మార్చనున్నది. ఇందుకోసం రూ.7,289 కోట్లు వెచ్చిస్తారు. తొలి విడతలో 9,123 స్కూళ్లను రూ.3,497.62 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారు. తొలివిడతలో భాగంగా 8 వేల అదనపు తరగతి గదులను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అదనప తరగతి గదులతోపాటు, శిథిల భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తారు. ఈ పథకం అమలుకు మార్గదర్శకాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. వీటిపై ఒకట్రెండు రోజుల్లో జీవో జారీ చేయనున్నట్టు సమాచారం. జీవో జారీకాగానే 9,123 స్కూళ్లలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తారు. పాఠశాలల్లోని వసతులను పరిశీలించి, లోటుపాట్లను గుర్తిస్తారు. ఇదే సర్వేలో భాగంగా పాఠశాలల వారీగా అంచనాలు రూపొందిస్తారు. ఆ మేరకు పనులు చేపడుతారు.
సర్కారీ స్కూళ్లకు పూర్వ వైభవం
కొన్నేండ్ల క్రితం వరకు.. చదువులంటే సర్కారు చదువులే, బడులంటే ప్రభుత్వ బడులే. కాని ప్రైవేట్ స్కూళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో సర్కారు స్కూళ్లు ప్రాభవం కోల్పోయాయి. ప్రైవేటుతో పోల్చితే.. సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నా.. ప్రైవేటులోనే బాగా చదివిస్తారన్న అపోహతో, తమ పిల్లలకు మంచి విద్యనందించాలన్న తపనతో తల్లిదండ్రులు కాన్వెంట్లకు పంపడం మొదలైంది. కానీ.. కాలక్రమంలో వాటిలో ఫీజులు భారంగా పరిణమించాయి. అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన దుస్థితి ఎదురైంది. ఇంకొందరు తమ ఖర్చులను పూర్తిగా తగ్గించుకొని పిల్లల ఫీజులు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలుగా కనిపిస్తారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేయాలని భావించిన తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందన్న ఆలోచనకు వచ్చింది. ఈ ఆలోచన నుంచి ఉద్భవించిన కార్యక్రమమే ‘మన ఊరు -మన బడి’. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది పూర్తిస్థాయిలో అమలయితే, సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం వస్తుందని, ప్రవేశాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
విరాళాలు ఇవ్వొచ్చు
మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేవారు విరాళాలు సమర్పించవచ్చు. రూ.10లక్షల వరకు విరాళంగా అందజేసిన వారి పేరు, లేదంటే వారు సూచించిన పేరును పాఠశాలకు లేదా, తరగతి గదికి పెడతారు. రూ.2 లక్షలు అంతకు మించి విరాళంగా అందజేసిన వారికి ఎస్ఎంసీలో సభ్యుడిగా అవకాశం కల్పిస్తారు. పూర్వవిద్యార్థులు, ఎన్నారైలు, దాతల నుంచి నిధులను సమీకరిస్తారు. వస్తు రూపేణా సైతం విరాళాలు అందజేయవచ్చు.
నిధులు ఎస్ఎంసీలకే
‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకతతో, అత్యంత వేగంగా అమలుచేస్తారు. పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)లు పనులను పర్యవేక్షిస్తాయి. ఎస్ఎంసీలు పనులు చేపట్టేందుకు సిద్ధంగా లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. ఎస్ఎంసీలు తీర్మానం చేసి, నిధులను వినియోగించాలి. అంచనాలు తయారుచేసిన తర్వాత మొత్తం వ్యయంలో 15% నిధులను ఎస్ఎంసీలకు రివాల్వింగ్ ఫండ్గా కేటాయిస్తారు. ఈ నిధుల్లో నుంచి 1/3 వంతు నిధులను వినియోగించగానే, ఖర్చు చేసిన మొత్తాన్ని ఎస్ఎంసీ అకౌంట్లల్లో జమచేస్తారు. ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, అసిస్టెంట్ ఇంజినీర్, సర్పంచ్తో కూడిన నలుగురు సభ్యుల కమిటీ సంయుక్తంగా సంతకాలుచేసి చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తుంది.
నిధుల మంజూరు ఇలా..
ఈ పథకానికి సంబంధించిన నిధులను దశలవారీగా విడుదల చేస్తారు. రూ.30 లక్షల వరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రూ.50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు సూపరింటెండెంట్ ఇంజినీర్, రూ.2 కోట్లు మించిన అంచనాలకు చీఫ్ ఇంజినీర్లు అనుమతులు మంజూరు చేస్తారు. ప్రతి నెల ఆర్థికశాఖ రూ.150 కోట్లను కార్పస్ ఫండ్గా మంజూరు చేస్తుంది. ఆయా నిధులను సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారులు స్కూళ్లకు కేటాయిస్తారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ (ఎస్ఏఏటీ) సంస్థ చేత సామాజిక తనిఖీ నిర్వహిస్తారు.
పూర్వ విద్యార్థుల సంఘం
ప్రతి సూల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులోని ఇద్దరు క్రియాశీలక పూర్వ విద్యార్థులు, సర్పంచ్, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. ఈ కమిటీ దాతల నుంచి, సీఎస్ఆర్ ద్వారా నిధులను సమీకరించి, వాటిని ఖర్చు చేస్తుంది. ఈ నిధుల వెచ్చింపునకు ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహిస్తారు.
ఇసుక ఇచితం..
స్కూళ్లలో చేపట్టే సివిల్ వర్క్స్కు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఉచితంగా ఇసుకను అందిస్తుండగా.. ఇప్పుడు ‘మన ఊరు – మన బడి’ పథకానికి సైతం వర్తింపజేయనున్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపడతారు. సిమెంట్ను తయారీదారుల నుంచే తక్కువ ధరకే సేకరిస్తారు. అంతేకాకుండా సర్వీస్ చార్జీలు, క్వాలిటీ కంట్రోల్ చార్జీలను మినహాయిస్తారు. రైతు వేదికలకు ఖరారుచేసినట్లుగానే సిమెంట్, స్టీల్ ధరలను ఖరారుచేస్తారు.
ప్రత్యేక సాఫ్ట్వేర్..
‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేయిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ ఈ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నది. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగానే మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సాంకేతిక అంశాలను ఐటీ విభాగం పర్యవేక్షిస్తుంది. పనుల పర్యవేక్షణలో పంచాయతీరాజ్, ఎస్ఎస్ఏ, ఆర్అండ్బీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగాల సహకారాన్ని సైతం తీసుకుంటారు.
స్కూళ్ల ఎంపిక ఇలా
మండలం యూనిట్గా అత్యధిక ఎన్రోల్మెంట్ గల స్కూళ్లను ఈ పథకం కోసం ఎంపికచేస్తారు. తొలి విడతలో పథకాన్ని అమలు చేసే 35% స్కూళ్లల్లోనే 65% విద్యార్థులు చదువుతుండటం విశేషం. జిల్లా మంత్రి, కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ స్కూళ్లను ఎంపిక చేస్తుంది. 2020-21 యునిఫైడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ (యూడైస్) నివేదికలో పొందుపరిచిన వివరాలతోపాటు, తాజాగా పెరిగిన ఎన్రోల్మెంట్ వివరాల ఆధారంగా స్కూళ్ల ను ఎంపికచేస్తారు. రెండో విడతలో 35%, మూడో విడతలో 30% స్కూళ్లను అభివృద్ధి చేస్తారు.