హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురూ కలిసి సభకు హాజరుకావడం తాను ఇంతవరకు చూడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు దరూ సభలో ఒక్కరోజు కూడా కనిపించలేదని చెప్పారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందు వారంతా ఒక స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టుకొని వ్యూహాలు పన్నుతున్నారనే వార్తలు విన్నానని, ఇక్కడ మాత్రం కనిపించలేదని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధులను రూ.5 కోట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఇంత భారీ మొత్తం ఇస్తున్న చరిత్ర మరే రాష్ట్రంలో లేదని చెప్పారు. ఎంపీలకు కూడా రూ.5 కోట్లే ఇచ్చేవారని, అవి కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రూ.152.50 కోట్లతో వివిధ చేపల మార్కెట్లను అభివృద్ధి చేసినట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలో పలువురు సభ్యులు చేపల పెంపకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రసమయి బాలకిషన్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్లో అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంజూరు చేస్తామని చెప్పారు. జీవన్రెడ్డి కోరిన విధంగా నిజామాబాద్ జిల్లాలోని 18 ముంపు గ్రామాలకు అవకాశం ఇస్తామని తెలిపారు. సండ్ర వెంకట వీరయ్య కోరినట్టుగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కల్లూరులో మార్కెట్లు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ చొరవతో హైదరాబాద్లోని బేగంబజార్లో ఫిష్మార్కెట్ పూర్తయిందని, భూ సమస్య కారణంగా చిలకలగూడ మార్కెట్ పూర్తి కాలేదని పేర్కొన్నారు.
గ్రేటర్హైదరాబాద్లో ఆర్టీసీ డిపోలు మూయలేదు: మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఆర్టీసీ డిపోను కూడా మూసివేయలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు సీతక్క, మౌజంఖాన్, ముంతాజ్ అహ్మద్ఖాన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొవిడ్ కారణంగా ఆక్యుపెన్సీ రేషియో 36 నుంచి 22కు పడిపోవడంతో బస్సుల సంఖ్యను తగ్గించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు రూ.4, 500 కోట్లు ఇచ్చి ఆర్టీసీని ఆదుకొన్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ 10 డబుల్ డెక్కర్ బస్సులను హెచ్ఎండీఏ ద్వారా తెప్పిస్తున్నారని వెల్లడించారు.