మోసాల వెనక చైనీయుల మాస్టర్మైండ్
నేపాల్లో సైబర్ముఠాల అడ్డాలు
రుణయాప్ బెదిరింపులు అక్కడి నుంచే..
ఆ దేశం వారిని పాత్రధారులు చేస్తున్న వైనం
చీటింగ్ విధానం మార్చిన మోసగాళ్లు
దేశం అవతల సేఫ్ జోన్ నుంచి గేమ్
సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): చైనీయుల బ్యాక్గ్రౌండ్తో నడిచే సైబర్నేరాల్లో నేపాల్ను ముఠాలు అడ్డా చేసుకుంటున్నాయి. చిక్కకుండా ఉండేందుకు కాల్సెంటర్లను అక్కడికి తరలించడం.. ఆ దేశం వారిని పాత్రధారులుగా చేయడం చేస్తున్నారు. గతంలో రుణ యాప్ల కేసులో చైనీయులు అరెస్ట్ అయ్యారు. భారీ స్థాయిలో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కొత్త ప్లాన్తో రుణ యాప్లతో రెడీ అయ్యారు క్రిమినల్స్.
నేపాల్ నుంచి..
ఈ సారి పోలీసులకు దొరకకుండా సైబర్ చోరులు పకడ్బందీ ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాప్ల ద్వారా అవసరమైన వారికి రుణాలు ఇవ్వడం.. వాటిని వసూలు చేసే బాధ్యతను దేశం అవతలి నుంచి చేయడం చేస్తున్నారు. వాట్సాప్ కాల్స్ను ఉపయోగించి.. రుణ గ్రహీతలను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఇటీవల రుణం తీసుకున్న ఓ బాధితురాలు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను నేరస్తులు అసభ్య పదజాలంతో తిట్టడమే కాదు.. సెల్ఫోన్కు ఒకేసారి 15 అశ్లీల వీడియోలను పంపించారు. అందులో ఒకదాంట్లో ఆమె ఫొటోను మార్ఫింగ్ చేశారు. ఎక్కడి నుంచి ఆ వీడియోలు పంపించారనే విషయంపై పోలీసులు వాట్సాప్ నంబర్ను ట్రేస్ చేశారు. అది నేపాల్ నుంచి అపరేట్ అవుతున్నట్లు గుర్తించారు.
ఇన్వెస్ట్మెంట్ మోసాలతో..
ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో ఇటీవల రాచకొండ పోలీసులు ముగ్గురు నేపాలీలను అరెస్ట్ చేశారు. వారు పశ్చిమబెంగాల్లో ఉంటూ.. ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో పాత్రధారులుగా ఉన్నారు. ఈ స్కామ్ నిర్వాహకుడు పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి చీటింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఆ నేరస్తుడు నేపాలీలను అక్కడకు రప్పించి.. వాళ్లకు ఇక్కడి ఆధార్కార్డులు ఇవ్వడం, వాటి ద్వారా బ్యాంకు ఖాతాలను ఇప్పించడం.. దోచుకున్న డబ్బులను క్రిప్టో కరెన్సీలోకి మార్చి.. చైనాకు తరలించడం చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్లో నేపాలీ దేశస్తులతో కాల్సెంటర్ నిర్వహించాలని ప్లాన్ చేశాడు. సిలిగురి నుంచి నేపాల్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో నిందితులు నేరాలు ఇక్కడ చేయడం, అక్కడికి వెళ్లి తలదాచుకోవడం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.
రూటు మార్చారు…
రుణయాప్ల నుంచి రుణం పొంది నిర్ణీత సమయంలో చెల్లించిన వారు, చెల్లించని వారికి ఇటీవల ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మూడు ప్రక్రియల్లో బాధితులకు ఫోన్లు చేస్తుంటారు. మొదట కాల్ చేయడం, రెండోది కొద్దిమేర బెదిరించడం.. మూడోది బాధితులకు అశ్లీల వీడియోలు, వారి కాంటాక్టులో ఉన్న వారి నంబర్లకు కూడా వాటిని ఫార్వర్డ్ చేయడం చేస్తుంటారు. ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించిన తరువాత అక్కడితో ఒప్పందం రద్దవుతుంది. అయితే అప్పు కట్టిన కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారని పోలీసులు లోతైన దర్యాప్తు చేయడంతో దేశం అవతలి నుంచి వాట్సాప్ కాల్స్ల్లో మాట్లాడుతుండడంతో తమను ఎవరూ పట్టుకోరనే ధీమా ఇప్పుడు సైబర్నేరగాళ్లలో వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.