వరంగల్ చౌరస్తా : ఎండీఎస్ ప్రవేశాలకు నీట్ అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి పీజీ కటాఫ్ మార్కులను 23.029 పర్సంటేజ్ తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకు జనరల్ అభ్యర్థులు 26.971 పర్సంటెజ్ 152 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్ధులకు 16.971 పర్సంటెజ్ 152 మర్కులు, దివ్యాంగులకు 21. 971 పర్సంటెజ్ 170 మార్కులు కటాఫ్ స్కోర్గా ప్రకటించింది. ఈ మేరకు ఎండీఎస్ ప్రవేశాలకు కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లభర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ ఉదయం 8గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
నిర్ధేషిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థి ధ్రువ పత్రాలను సైతం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ధ్రువ పత్రాలను యూనివర్సిటీ అధికారులు పరిశీలించిన తదుపరి యూనివర్సిటీ సవరించిన మెరిట్ లిస్ట్ ప్రకారం జాబితాను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. మరింత సమాచారం కోసం WWW.knruhs.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చు.