ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపధ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ వెంట ఉంటామని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. ముంబైలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము ఎంవీఏకు మద్దతిస్తామని, ఉద్ధవ్ ఠాక్రే వెంట చివరివరకూ నడుస్తామని పేర్కొన్నారు.
ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ ఠాక్రే వెన్నంటి ఉంటారని చెప్పారు. తాజా రాజకీయ పరిస్ధితిని తాము గమనిస్తున్నామని, రెబెల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే ఎంవీఏ సర్కార్పై చేసిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని అజిత్ పవార్ తోసిపుచ్చారు. మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఎమ్మెల్యేలున్నారని, అందరి ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
ఎంవీఏ నుంచి శివసేన బయటకు వస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మూడు పార్టీలపైనా ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి ప్రకటన ఎందుకు చేశారో సంజయ్ రౌత్కే తెలియాలని అన్నారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా వైదొలిగేందుకు తాను సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు.