హిమాయత్నగర్/ హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కాల్ సెంటర్ ముసుగులో ఆన్లైన్ ద్వారా మత్తుపదార్థాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ముంబై యూనిట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఆన్లైన్ ద్వారా మత్తుపదార్థాలు విక్రయించడంతోపాటు ముంబైలో నమోదైన డ్రగ్స్ సరఫరా కేసులతో సంబంధం ఉన్నట్టు అందిన పక్కా సమాచారంతో గురువారం హిమాయత్నగర్లోని స్ట్రీట్ నంబర్ 10కు చెందిన ఆశిష్ జైన్ (35) అనే వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు రూ. 3.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆశిష్ జైన్ చిక్కడపల్లిలో ఓ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు.
ఈ కాల్ సెంటర్ ముసుగులో దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్వర్క్ ద్వారా ఆల్ఫ్రాజోలం, ఇతర నిషేధిత మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మరో ఘటనలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం బండ్లగూడ జాగీర్ సమీపంలోని సన్ సిటీ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహించగా మోనపాటి వెంకటసాయి గోపీచంద్, మల్లికార్జున్రెడ్డి కారులో డ్రగ్స్ తీసుకెళ్తూ దొరికారు. వీరి వద్ద 30 ఎండీఎంఏ డ్రగ్ సాచెట్స్ను స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని, కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.