న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెలో రవాణా, విద్యుత్తు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్.. ఇలా అన్ని రంగాల కార్మికులు పాల్గొంటారని వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గించిందని, ఇంధన ధరలను ఎడాపెడా పెంచుతున్నదని కార్మిక సంఘాలు విమర్శించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులపై అధికంగా పడుతున్నదని పేర్కొన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు విద్యుత్తు రంగ ఉద్యోగులు ప్రకటించారు. బుధవారం జరిగిన విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.