ఎదులాపురం, డిసెంబర్ 1 : నెలలోపు ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని జంక్షన్ల పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్, తెలంగాణ చౌక్లలో కొనసాగుతున్న నిర్మాణాలను గురువారం పరిశీలించారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఏఈ అరుణ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక జిల్లాల అభివృద్ధిలో వేగం పెరిగిందని చెప్పారు. మారుమూల ఆదిలాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. నూతన ఆదిలాబాద్ పట్టణంగా రూపుదిద్దుకుంటున్నదని, మరింత ఆహ్లాద వాతవరణం అం దించే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నా రు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజూ చెత్తశుద్ధీకరణతో పాటు మొక్కల పెంపకాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ప్ర జా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలతో మమేకమై టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ లక్ష్మణ్, టీఆర్ఎస్ కార్యకర్త వేణుగోపాల్, అశోక్ పాల్గొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంతో పేద వర్గాలు విద్యకు దూరమవుతాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్ వన్ పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. విద్యను వికేంద్రీకరణ చేయాల్సిన కేంద్రం.. కేంద్రీకృతం చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిందని, తాజాగా విద్యారంగాన్ని కూడా ప్రైవేట్కు అప్పగించే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు లింగారెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకట్ , జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వీ అశోక్, జిల్లా ఉపాధ్యక్షురాలు సురేఖ, లక్ష్మణరావు, కోశాధికారి కిష్టన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, శివన్న, విఠల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా సభ్యులు ఎమ్మెల్యే జోగు రామన్నను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యల పరిష్కారానికి తనవంతుగా పూర్తి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కలిసిన వారిలో కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కన్వీనర్ దిగంబర్, కోశాధికారి సాంబయ్య తదితరులున్నారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమ లు చేస్తున్నదని, వాటి గురించి తెలుసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. వ్యవసాయ మా ర్కెట్ ద్వారా రైతు బంధు పథకం, పంట నిల్వ చేసిన రైతులకు రుణాలు అందించారు. జిల్లాలో తొలిసారి పంట నిల్వలపై రుణం పొందిన జందాపూర్కు చెందిన రైతులకు మార్కెట్ యా ర్డులో ఎమ్మెల్యే చెక్కులు అందించారు. రైతుబంధు పథకం మా ర్కెటింగ్ శాఖ ద్వారా పంటలను గోదాంలలో నిల్వ చేసి వాటిపై పంట విలువతో 75 శాతం రుణం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, మార్కెట్ కార్యదర్శి వెంకన్న ఉన్నారు.
41వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిని రవి కుమార్, డీఎస్పీ వీ ఉమేందర్, కోశాధికారి హరిచరణ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్డేడియంలో 41వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించనున్నారని తెలిపారు. ఇందులో 20 రాష్ర్టాల నుంచి 600 మంది క్రీడాకారులు, 100 మంది అధికారులు పోటీలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వీరందరికీ పట్టణంలో వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్గా తాను, కన్వీనర్గా డీఎస్పీ వీ ఉమేందర్, అధ్యక్షుడిగా సాయిని రవికుమార్, జనరల్ సెక్రటరీగా సోమశేఖర్, కోశాధికారిగా హరిచరణ్ వ్యవహరిస్తున్నారని వివరించారు. పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్రీడాభిమానులు, యువజన సంఘాల సభ్యులు, ప్రజలు పోటీలకు సహకరించాలని తెలిపారు.