హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: దేశంలో వెదురు సాగును ప్రోత్సహించటానికి విసృ్తత అవకాశాలు ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఏఎస్ నాగేంద్రనాథ్ సిన్హా పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించాలంటే సమన్వయ ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇందుకు మంచి జాతీయ విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్), సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సీఐపీఎస్) సంయుక్తంగా ‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుపర్చడం కోసం వెదురు రంగంలో ఆవిష్కరణల వ్యాప్తి’ అనే అంశంపై గురువారం రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీపీఆర్ వికాస్ ఆడిటోరియంలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సును నాగేంద్రనాథ్ సిన్హా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు. వెదురులో వ్యాల్యూ చెయిన్ను అభివృద్ధి చేయటంపై దృష్టి సారించాలని ఆయన నిపుణులను కోరారు. వెదురు పెంపకంతో పర్యావరణంతో సహా బహుళ ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. రైతులకు ఆర్థికంగా, సామాజికంగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వెదురులో వ్యాల్యూ యాడెడ్ చైన్ను అభివృద్ధి చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను సృష్టించడంపై ఎన్ఐఆర్డీపీఆర్, సీఐపీఎస్ దృష్టి పెట్టాలని సూచించారు. సదస్సులో ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్రకుమార్, సీఐపీఎస్ డైరెక్టర్ అచలేందర్రెడ్డి, వెదురు ఉత్పత్తుల పారిశ్రామిక వేత్తలు, రైతులు, చేతివృత్తుల వారు, అటవీశాఖ అధికారులు, పరిశోధన విద్యార్థులతో సహా వివిధ రాష్ర్టాల నుంచి 160 మంది పత్రినిధులు పాల్గొన్నారు.