హైదరాబాదీ యువతికి జాతీయ పురస్కారం
వ్యర్థాలకు కొత్త అర్థం చెప్తున్న సాహితీ స్నిగ్ధ
సొంతూరుపై మమకారంతో అమెరికాకు వీడ్కోలు
ప్రకృతిని అందరూ ఆస్వాదిస్తారు. కానీ.. కొందరే దాని పరిరక్షణకు పరితపిస్తారు! ఆ తపనే సాహితీ స్నిగ్ధను అమెరికాను, అక్కడ లక్షల్లో వచ్చే జీతాన్ని వదిలి సొంతూరి వైపు అడుగులు వేయించింది! క్లీనెస్ట్ హైదరాబాద్ ఆమె కల! కానీ.. కలగనటంతోనే సరిపెట్టలేదు.. కార్యాచరణలో దిగారు! వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ప్రకృతిని కాపాడటమేకాదు.. సేకరించిన వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తూ వేలమంది జీవితాల్లో కొత్తవెలుగులు ప్రసరింపజేస్తున్నారు. ఆమె చేస్తున్న కృషికి కేంద్రం ఫిదా అయింది! స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ‘రీసైక్లింగ్ హీరోయిన్’గా ఆమెకు గుర్తింపునిచ్చింది! తెలంగాణ నుంచి ఈ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి స్నిగ్ధ కావడం విశేషం.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ప్రకృతిని ఆస్వాదించడం అందరికీ తెలుసు.. కానీ పర్యావరణాన్ని కాపాడాలన్న స్పృహ కొందరిలోనే ఉంటుంది. సొంతూరును ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు.. అయితే పుట్టిన గడ్డకు మంచి చేయాలని రూ.లక్షల్లో జీతం వచ్చే అమెరికా ఉద్యోగాన్ని వదిలి వచ్చేవాళ్లు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న యువతి సాహితీ స్నిగ్ధ. వ్యర్థాలకు కొత్త అర్థం చెప్తూ.. అటు ప్రకృతికి ఇటు ప్రజలకు మేలు చేస్తున్నది. అంతేకాదు.. అదే వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తూ సుమారు ఆరువేల మందికి అండగా ఉంటున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆమెను స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ‘రీసైక్లింగ్ హీరోయిస్’గా గుర్తించింది. తెలంగాణ నుంచి ఈ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి స్నిగ్ధ కావడం విశేషం.
అమెరికా నుంచి హైదరాబాద్కు
స్నిగ్ధకు చిన్నప్పటి నుంచి పర్యావరణంపై మక్కువ. బీటెక్ పూర్తయిన తర్వాత అమెరికాకు వెళ్లి తన ఇష్టానికి తగినట్టు ‘గ్రీన్ టెక్నాలజీస్’లో మాస్టర్స్ చేశారు. అనంతరం అమెరికా, కెన్యా, దుబాయ్ వంటి దేశాల్లో హరిత భవనాలు, పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టుల్లో పనిచేశారు. పలు ఎన్జీవోలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి వాతావరణ మార్పులపై అవగాహన కల్పించారు. పుట్టిన గడ్డ హైదరాబాద్కు సేవ చేయాలనే లక్ష్యంతో 2018లో అమెరికా నుంచి వచ్చేశారు. ‘వేస్ట్ వెంచర్స్ ఇండియా’ అనే సంస్థలో మేనేజర్గా చేరారు. ప్రస్తుతం సీవోవో, డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థలో ప్రస్తుతం 80 మంది సిబ్బంది ఉన్నారు.
వీరు హైదరాబాద్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రజలతో సమావేశమై వారికి వ్యర్థాల నిర్వహణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. తడిచెత్తను, పొడిచెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చి అందులో సగం ఎరువును వారికే అప్పగిస్తున్నారు. మిగతా సగాన్ని రైతులకు, ఇతరులకు నామ మాత్రపు ధరకు అమ్ముతున్నారు. పొడి చెత్త నుంచి ప్లాస్టిక్, ఇనుము, ఇతర పదార్థాలను వేరు చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపుతున్నారు. సుమారు ఆరువేల మంది పారిశుద్ధ్య కార్మికులు, చిత్తుకాగితాలు ఏరుకునేవారి సహాయంతో వీరు వ్యర్థాలను సేకరిస్తున్నారు.
రోజుకు రెండు టన్నులు
వేస్ట్ వెంచర్స్ సంస్థ రోజుకు సుమారు రెండు టన్నుల వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేస్తున్నట్టు స్నిగ్ధ పేర్కొన్నారు. ఈ వ్యర్థాల నుంచి రోజూ సుమారు 200 కిలోల ఎరువు ఉత్పత్తి అవుతున్నదన్నారు. వ్యర్థాల సేకరణకు పంచాయతీలు, మున్సిపాలిటీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. నార్సింగి మున్సిపాలిటీని ‘జీరో వేస్ట్ సెంటర్’గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇక్కడ సేకరించిన తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తలో నుంచి పనికొచ్చే పదార్థాలను రీసైక్లింగ్కు పంపుతున్నారు. మిగతా వ్యర్థాలను బూడిదగా మార్చుతున్నారు. తద్వారా భూమిలోకి ఎలాంటి వ్యర్థాలు చేరవు.
క్లీనెస్ట్ సిటీ హైదరాబాద్ నా కల
హైదరాబాద్ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ అమలు చేస్తున్న ప్రణాళిక అద్భుతంగా ఉన్నది. వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టడం, ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించడం గొప్ప ఆలోచన. 2025 నాటికి దేశంలోనే అత్యంత స్వచ్ఛనగరంగా హైదరాబాద్ నిలవాలని నా కల. ఆ దిశగా ప్రభుత్వంతో కలిసి శ్రమిస్తాను. వ్యర్థాల సేకరణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండటం చాలా ఆనందాన్ని ఇస్తున్నది.
-సాహితీ స్నిగ్ధ