హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల్లో ఒకడైన నందకుమార్ అలియాస్ నందు భార్య చిత్రలేఖ మరోసారి సిట్ విచారణకు హాజరైంది. ఇప్పటికే శుక్రవారం సిట్ విచారణకు హాజరైన ఆమెను అధికారులు సోమవారం రెండోసారి ప్రశ్నించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో అధికారులు ఆమె నుంచి పలు కీలక వివరాలను రాబట్టినట్టు తెలిసింది. నందకుమార్ బ్యాంకు లావాదేవీలు, వాట్సప్ ద్వారా ఆయన చిత్రలేఖకు పంపిన సందేశాలు, ఇతర మెసేజీల్లోని వివరాలతోపాటు నందకుమార్తో సన్నిహితంగా మెలిగేవారి వివరాలపై ఆమెను ప్రధానంగా ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు సమాచారం. కాగా, ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగళవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. ఈ మేరకు సిట్ అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు.