కేసు నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని రూ.218 కోట్లకు మోసం చేసిందంటూ హైదరాబాద్కు చెందిన నందిని ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఐఐపీఎల్)పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. ఎన్ఐఐపీఎల్, దాని ఎండీ హరిదాస్ రమేశ్పైనా ఈ కేసు దాఖలవగా, తప్పుడు పత్రాలను సమర్పించి రుణాలను పొందడమేగాక అనుబంధ సంస్థల ద్వారా వాటిని మళ్లించారని బుధవారం సీబీఐ అధికారులు తెలిపారు. తాము మూడుచోట్ల సోదాలు జరిపి నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారి ఆర్సీ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కాగా, గతంలో టీఎస్ఎస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్గా రసాయన ఎగుమతులు చేసిన ఈ సంస్థ.. 2007లో సికింద్రాబాద్ ఎస్బీఐ శాఖ నుంచి రూ.9.5 కోట్ల తొలి రుణాన్ని పొందింది. ఏడాది తర్వాత ఈ రుణాలు రూ.89.50 కోట్లకు చేరాయని సీబీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే చెల్లింపులు జరగక, 2014 మార్చిలో ఇవి మొండి బకాయి (ఎన్పీఏ)లుగా మారాయి. 2019 నవంబర్ 30కి అసలు, వడ్డీతో కలిపి దాదాపు రూ.172.71 కోట్లకు చేరిన బాకీలు.. 2021 మార్చి 31 నాటికి రూ.218.21 కోట్లకు పెరిగాయని జోషి వివరించారు.