Karnataka Congress | కర్ణాటక, అక్టోబర్ 25 ( నమస్తే తెలంగాణ ) : కర్ణాటక కరెంటు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత పల్లెల్లో పగటిపూట కరెంటు జాడ కనిపించటం లేదు. రాత్రిపూట ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని కన్నడిగులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం ఫోన్ చార్జింగ్ పెట్టుకోవటానికి కూడా కరెంటు ఉండటంలేదని అక్కడి పరిస్థిలు తెలుసుకోవటానికి వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ బృందంతో స్థానికులు తెలిపారు.
కర్ణాటకలోని రిబ్బనపల్లి గ్రామం తెలంగాణ సరిహద్దు (కొడంగల్ నియోజకవర్గం) చెక్పోస్టు వద్ద ఉంటుంది. నెలన్నర నుంచి పగటిపూట కరెంటే రావడం లేదని అక్కడి పరిస్థితిని విద్యార్థులు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఒక విద్యార్థి ఇప్పుడే వస్తానంటూ తన స్నేహితులకు చెప్పి సైకిల్ ఎక్కాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అతన్ని అడిగితే, సెల్ఫోన్ చార్జింగ్ అయిపోయింది పెట్టుకొని వస్తానన్నాడు. కరెంటే లేనప్పుడు చార్జింగ్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తే, దూరంగా కనిపిస్తున్న ఊరిని చూపిస్తూ అక్కడ కరెంట్ ఉంటుందన్నాడు. అది కర్ణాటక సరిహద్దుకు ఆవల ఉన్న తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కస్తూరిపల్లి. ఆ పిల్లలు చెప్పింది వినగానే ఒక్కసారిగా కరెంట్ లేని ఊర్లో షాక్ కొట్టినంత పనైంది.
కర్ణాటక ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాల గురించి చెప్పడానికి ఈ ఉదంతం ఒక్కటి చాలు. ఇక్కడ తమ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో కర్ణాటక తరహా ఉచితాలను అందిస్తామని ప్రజలను మోసగించాలని చూస్తున్నదనే విమర్శలున్నాయి. కొసమెరుపు ఏంటంటే సేడం నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగిలోనే ఉన్నది. ఆయన సొంత జిల్లాలోనే ఈ దుస్థితి ఉంటే, తెలంగాణలో ఆ పార్టీ ఏం ఒరుగబెడుతుందో చెప్పాల్సిన అవసరం లేదని మేధావులు అంటున్నారు.