అబద్ధాలు, అర్ధ సత్యాలు, అవమానాలు, అంతులేని వివక్షలు, వక్రీకరణలు, వంకర రాతలతో ఆధిపత్య భావజాలాన్ని సృష్టించిన సీమాంధ్ర మీడియా రేపిన కల్లోలంలోంచి వికసించిన కుసుమం ‘నమస్తే తెలంగాణ’.
అలనాడు పదకొండేండ్ల కిందట అబద్ధాల కోటలు బద్దలు కొట్టేందుకు పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలానికి కరదీపిక అయ్యింది నమస్తే తెలంగాణ. ఇవ్వాళ్ల ‘నమస్తే తెలంగాణ’ పుట్టినరోజు.
సరిగ్గా పదకొండు సంవత్సరాల అనంతరం కూడా మళ్లీ అవే దృశ్యాలు.. మళ్లీ అబద్ధాలు.. అర్ధ సత్యాలు.. అవమానాలు.. అంతులేని వివక్షలు.. వక్రీకరణలు.. వీటికి వేదిక కల్పిస్తున్న భావజాల ప్రచారంలో మళ్లీ అదే మీడియా… అయితే ఈసారి రూపుమార్చుకున్నది. అప్పుడు సీమాంధ్రుల కొమ్ముకాసింది. ఇప్పుడు కేంద్రప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ ప్రాయోజిత మీడియాగా పనిచేస్తున్నది. సేమ్ టు సేమ్.. కాలం మాత్రమే ముందుకు ప్రవహించింది.
స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం, స్వీయ ప్రాంతీయ ప్రయోజనాల కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతీకగా ‘నమస్తే తెలంగాణ’ అలనాడు ఆవిర్భవించింది. అది అన్ని వివక్షలకు వ్యతిరేకంగా పోరాడింది. సీమాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ పోరాటానికి అది నిలువెత్తు పతాక అయ్యింది. తెలంగాణ గడ్డ మీద ఉంటూ ఆంధ్రుల ప్రయోజనాల కోసం, ఆంధ్రుల ఆధిపత్య భావజాలాలను పెంచి పోషించే కరపత్రాలుగా అలనాటి మీడియా పనిచేసింది. ఆ మీడియా ఆగడాలు తట్టుకోలేక, ప్రజల్లో అది వ్యాపింపజేస్తున్న ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవడానికి నమస్తే తెలంగాణ పురుడు పోసుకున్నది. ఉద్యమం శిఖరాగ్రం అంచున మెరిసిన వజ్రంలా తెలంగాణ సొంత పత్రిక అయ్యింది.
అదొక చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చింది. తెలంగాణ ఏర్పడింది. నిరుపమాన త్యాగాలు, కేసీఆర్ దీక్ష, సబ్బండ వర్ణాలు సకలజనుల ఆరాట పోరాటాలతో తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యా రు. అప్పటికే అన్నిరకాల పార్టీల, అన్నిరకాల ప్రభుత్వాల పదఘట్టనల్లో నలిగిన తెలంగాణ శిథిలమైపోయింది. ఆ శిథిలాల మీదుగా ఒక పునర్నిర్మాణం జరగవలసి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం అందుకే పునర్నిర్మాణం నినాదం ఎత్తుకున్నది. ఈ క్రమమంతా అభివృద్ధి, ఎనిమిదేళ్ల సత్వర, అతి వేగవంతమైన ఫలితాల యుగం. దీన్ని కూడా ఒక ప్రాధాన్యతగా, ఒక బాధ్యతగా.. తెలంగాణ కోసం జరుగుతున్న ఒక మహా పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రతిబింబించింది ‘నమస్తే తెలంగాణ’.
తెలంగాణ వస్తే చీకటి అన్న వాళ్ల చీకటి ప్రపంచం మీద కరెంటు వెలుగులు ప్రసరింపజేసింది తెలంగాణ. అంతాజేసి ఎనిమిదేళ్లు. దేశం బొగ్గు సంక్షోభంలో, కరెంటు కోతల వలయంలో కూరుకుపోయిన ఈ క్షణాన తెలంగాణ రెప్పపాటు కోతలేని వెలుగుల ప్రపంచం అయ్యింది. ఇది కనబడదా? వినపడదా? ఇదెట్లా సాధ్యమయింది. తెలంగాణ వచ్చిన 2014 నాటికి, ఎనిమిదేండ్ల అనంతర దృశ్యాలకు పోలికే లేదు. శిథిలమైన, ధ్వంసమైన పల్లెలు కళకళలాడుతున్నవి. జీవం కోల్పోయిన ‘శాతానం’ నలుచెరగుల్లో కళకళలాడుతున్నది. రైతుబంధు, రైతు బీమాలు వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేశాయి. నీటి వనరులు జలజల లాడుతున్నవి.
ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్ సరఫరాలో, తాగు, సాగునీరు సదుపాయాలలో, ప్రజాసంక్షేమంలో, వ్యవసాయమే కాదు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో, ఐటీ పారిశ్రామిక రంగాలలో ఎనిమిదేండ్ల తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది. ఇది నిజం కదా! పోల్చి చూసినప్పుడే గతానికి, వర్తమానానికి మధ్య జరిగిన అభివృ ద్ధి తెలిసేది. అక్షరాలా కేంద్ర ప్రభుత్వ గణాంక వివరాలల్లో ఇవన్నీ నమోదవుతున్నాయి. కేంద్ర గణాంక వివరాలు తెలంగాణ అభివృద్ధి రేటు 17 శాతానికి పైగా ఉందని తేల్చాయి.
మిషన్ భగీరథ ఇంటింటి దూప తీర్చింది. నల్లాల కాడి కొట్లాటలు, బిందెలు పట్టుకొని నీటి వనరులను వెదుకులాడుతూ తిరిగిన తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ‘భగీరథ’తో దాహం తీర్చుకోగలుగుతున్నాయి. నీటిపారుదల వ్యవస్థలపై పూర్తి పట్టున్న కేసీఆర్ ముందుచూపుతో.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’. ఇది చెరువుల పూడికలు తీసింది. దాని ఫలితమే తెలంగాణ అంతా సస్యశ్యామలం అయ్యింది. నడి ఎండకాలంలో కూడా చెరువులు, వాగులు, వంకల్లో నీరుండటం దీనివల్లనే సాధ్యమయ్యింది.
ఇప్పుడు అపార జలరాశిని నింపుకొని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా నిండు గోదారిని ప్రవహింపజేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. ఇది మన కండ్ల ముందు నమోదైన చరిత్ర. సీమాంధ్ర పాలనలో ఏండ్లు గడిచినా పూర్తికాని ప్రాజెక్టులు, ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో ఏండ్ల తరబడి నాన్చిన ప్రాజెక్టులు, సగం పూర్తయి పడావుపడిన ప్రాజెక్టులు, తెలంగాణ అరిగోసలకు అద్దంగా నిలిచాయి. కానీ కేవలం మూడేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచెయ్యడం ఒక విజ యం. అందుకే 2014 నాటికి తెలంగాణలో సాగు యోగ్యంగా ఉన్న భూమితో పోలిస్తే ప్రస్తుతం సాగవుతున్న భూమి అనేక రెట్లు పెరిగింది.
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల లాంటి పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసుకున్న తెలంగాణ, ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనఖా కొరాట లాంటి ప్రాజెక్టుల పనులను వేగంగా సాగిస్తున్నది. నీటిపారుదల రంగంలో తెలంగాణ మేటి అయ్యింది. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉన్న తెలంగాణకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న ఎటకారం మాటలు మొదలుకొని, ఇప్పటిదాకా కాళ్ళల్ల కట్టెపెట్టినట్టు ప్రాజెక్టులకు అడ్డం పడటం, కట్టిన ప్రాజెక్టులకు రంధ్రాన్వేషణ చేసి కరెంటు బిల్లుల సంగతులు మాట్లాడటం అంటే ఇది అంతర్గతంగా ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడటమే. దానికి విరుద్ధంగా తెలంగాణ ప్రయోజనాల వేదికగా ‘నమస్తే తెలంగాణ’ పని చేసింది.
శిథిలమైన నాటి తెలంగాణలో ఉత్పత్తి కులాలు కునారిల్లాయి. వృత్తులు అంతరించాయి. ప్రత్యామ్నాయం కరువయ్యింది. పల్లె కన్నీరు పెట్టింది. కానీ పునర్నిర్మాణంలో భాగంగా వృత్తులకు ప్రోత్సాహం పెరిగింది. గొర్రెలు, బర్రెలు ఇచ్చి, చేపలు చెట్లు ఇచ్చి మమ్మల్ని ఇట్లాగే ఉంచుతరా? అన్నవాళ్లకు గొర్రెలు పిల్లలు పెట్టి గొర్రెల సంపదను రెట్టింపు చేసినవి. సముద్రం లేని తెలంగాణలో ఇవ్వాళ్టి చేపల ఉత్పత్తి ఒక సమాధానం.
గొర్రెలు పంచి, చేపలు పంచి, పెంచి తెలంగాణ కులవృత్తుల ప్రోత్సాహంలో ఉత్పత్తి కులాల సంపద బహుళం చేసి కాపాడింది. అందుకే తెలంగాణ పథకాలు, పెట్టుబడులు అన్నీ ఉత్పత్తుల పెరుగుదల, ఉత్పత్తి శక్తులకు ఊతంగా నిలిచాయి. ఇదొక భావన. ప్రభుత్వాలు ప్రజల కోసం పెట్టే ప్రతి పైసా మళ్లీ పైసను సృష్టించాలి. నిరర్ధక పెట్టుబడుల వల్ల దేశాలు ఆగమైపోతయి అన్న స్పృహలో ఈ పెట్టుబడులు పెట్టినందున ఫలితాలు కనపడుతున్నాయి. ‘దళితబంధు’ అందుకే ఒక సామాజిక విప్లవం సాధించగలిగిన గొప్ప పథకం. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల పెట్టుబడి ఇచ్చి, ఆ పెట్టుబడులతో వాళ్లు సొంతంగా వ్యాపారం, వ్యవహారాలు చేసుకోవడానికి మార్గదర్శకాలు చూపే ఈ పథకం భవిష్యత్తులో ఒక విప్లవం. సామాజిక అసమానతల నిచ్చెన మెట్ల వ్యవస్థలో, దళితుల సాధికారత కోసం ఏర్పరిచిన ఒక అద్భుత ప్రణాళిక. అంతేనా తెలంగాణలో కనీసం 30 శాతం ఆదాయాన్ని ప్రజల సంక్షేమ పథకాల మీద ఖర్చుపెట్టడం ద్వారా ప్రతి ఇంటికి ఫలితం చేకూరే విధంగా పథకాల రూపకల్పన జరిగింది. ‘ఆసరా పింఛన్’ నుంచి ఆడబిడ్డల పెళ్లికి ఇచ్చే ‘కల్యాణలక్ష్మి’ దాకా తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇదంతా నమస్తే తెలంగాణ మాత్రమే లోకానికి చాటింది.
అలనాడు ఉన్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. అప్పుడు ఆంధ్ర ఆధిపత్య భావజాలం తెలంగాణను అవమానించింది. వివక్ష చూపింది. నిర్బంధించింది. స్వేచ్ఛను హరించింది. ఎదుగుదలను నిరోధించింది. అబద్ధాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసి తెలంగాణ భావనలను అవహేళన చేసింది. దాన్ని ఎదుర్కోవడానికి నమస్తే తెలంగాణ పుట్టింది. అప్పటి కనిపించే శత్రువు సీమాంధ్ర ప్రభుత్వం.
కానీ, ఇప్పుడు తెలంగాణకు అవమానాలు చేస్తున్న, వివక్ష చూపుతున్న, హక్కులు హరిస్తున్న, రావాల్సినవేవీ దక్కకుండా చేస్తున్నది కేంద్రం. అది తెలంగాణం అంటుంది. కానీ ఆచరణలో తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. అసలు తెలంగాణ పుట్టుకనే శంకిస్తుంది. తల్లిని చంపి బిడ్డను బతికించారంటుంది. తలుపులు మూసి రహస్యంగా తెలంగాణను ఇచ్చారంటుంది. తెలంగాణతో సంబంధం లేని అల్లూరి సీతారామరాజు అనే ఒక మహాయోధున్ని తెలంగాణకు అంటగడ్తుంది. సన్నాయి నొక్కులు నొక్కుతుంది. కానీ ఇచ్చేవి ఇవ్వకపోగా నూకలు తినాలని నకరాలు చేస్తుంది. అదే వివక్ష. అదే అవమానం.
సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉన్న తెలంగాణకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న ఎటకారం మాటలు మొదలుకొని, ఇప్పటిదాకా కాళ్ళల్ల కట్టెపెట్టినట్టు ప్రాజెక్టులకు అడ్డం పడటం, కట్టిన ప్రాజెక్టులకు రంధ్రాన్వేషణ చేసి కరెంటు బిల్లుల సంగతులు మాట్లాడటం అంటే ఇది అంతర్గతంగా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడటమే.
‘చంద్రుని వేపు వేలు చూపితే మూర్ఖుడు వేలు వేపు చూస్తాడు’ అన్నది చైనా సామెత. కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన జలసాగరం వేపు చూడమంటే మూర్ఖులు ‘కమీషన్ల’ వేపు వేలు చూపుతారు. దీనిని చిలువలు పలువలుగా మీడియా దృశ్యమానం చేస్తుంది. అందుకే ‘నమస్తే తెలంగాణ’ పునర్నిర్మాణ ప్రక్రియకు సొంత గొంతుక అయ్యింది. అది విడమర్చి తెలంగాణలో జరుగుతున్న పునరుజ్జీవన దృశ్యాలను చిత్రించింది. విజయగాథలను నిత్యం గానం చేసింది.
పదకొండేండ్ల వయసున్న ‘నమస్తే తెలంగాణ’.. ఆవిర్భావం నాటి స్ఫూర్తితో ఈ కొత్త చెడుగును ఎదిరించాల్సి ఉన్నది. కేంద్రం రూపంలో జరుగుతున్న సకల వ్యతిరేకతలను ఎండగట్టాల్సి ఉన్నది. ‘నమస్తే తెలంగాణ’ మరొక్కసారి లేచి నిలబడి తెలంగాణ స్వీయ ప్రయోజనాల కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం కొట్లాడాల్సి ఉన్నది.
సీమాంధ్ర ప్రభుత్వాల ప్రయోజనాల కోసం అలనాడు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించారు. ఎదురు తిరిగితే అణచివేశారు. ముందు తెలంగాణ అస్తిత్వాన్ని నిమ్నులను చేసి ఆంధ్రుల ఆధిపత్య భావజాలంతో అంతర్గత వలసను చేశారు. దాన్ని ఎదిరించడానికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కేవలం రాజకీయ అధికారం కోసం ఒకవేపు తెలంగాణను, దాని పుట్టుకను కించపరుస్తూ మరోవేపు తెలంగాణ ఆర్థిక వనరులను, అభివృద్ధిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నది. దాన్ని ఎదిరించాల్సిన తక్షణ కర్తవ్యం ఇప్పటి నమస్తే తెలంగాణది. తెలంగాణ సొంత గొంతుకగా, తెలంగాణ అస్తిత్వమే ఏకైక ఎజెండాగా ఉన్న ‘నమస్తే తెలంగాణ’కు ఇది పరమావధి.
ముందు నుంచీ తెలంగాణ పట్ల అన్యాయంగా కేంద్రం ప్రవర్తించింది. తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకలనయినా జరుపుకోకముందు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాకు కట్టబెట్టి అన్యాయాల పరంపరకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు ప్రాజెక్టును కోల్పోయింది తెలంగాణ. హైకోర్టు విభజనను ఐదేండ్ల పాటు పెండింగ్ పెట్టింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను అద్భుతమైనవని ప్రశంసించిన నీతి ఆయోగ్ 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని సూచించింది. కేంద్రం ఖాత రు చేయలేదు. కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవడానికి నిధులు కావాలన్న విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసింది. కరోనా కాలంలో కూడా ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు. విభజన చట్టంలో హామీలు ఒక్కటీ నెరవేరలేదు. పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపు ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలకు పంగనామాలు పెట్టింది కేంద్రం. ఐటీ హబ్గా విలసిల్లుతున్న హైదరాబాద్కు, దేశదేశాల మేటి ఐటీ కంపెనీల అడ్డా అయిన తెలంగాణకు ఐటీఐఆర్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసింది.
ధాన్యం కొనుగోలు కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించిన కేంద్రం చివరికి తెలంగాణ ప్రజలను నూకలు తినాలంటూ అవమానించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం నిలబడి చివరి గింజ వరకు కొని రైతాంగం పట్ల అంకితభావాన్ని నిరూపించుకున్నది. ఫెడరలిజానికి తూట్లు పొడుస్తూ, రాష్ట్రాల అధికారాలకు కేంద్రం తూట్లు పొడుస్తున్నది. అమృతోత్సవ సందర్భంలో అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా నిరంకుశ పోకడలతో కేంద్ర ప్రభుత్వం మరింత కేంద్రీకృత అధికారాలకు కేంద్రబిందువు అవుతున్నది. సమాఖ్య స్ఫూర్తి కుంచించుకుపోతున్నది. రాష్ట్రాల జాబితాలోని అంశాలు కుదించుకుపోతున్నవి. నిరంకుశత్వానికి పరాకాష్ఠగా ‘బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు’ అనే కుట్రపూరిత సిద్ధాంతాన్ని అమలుచేస్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, హక్కులను హరిస్తున్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి రుణ సేకరణ చేస్తూ ఆర్థిక క్రమశిక్షణతో విలసిల్లుతున్న ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణకు అప్పులు పుట్టకుండా చేస్తున్నది. విద్యుత్ సంస్కరణలను సమర్థిస్తేనే రుణాలకు అవకాశం కల్పిస్తామన్నందువల్ల తెలంగాణ 25 వేల కోట్ల రుణాలను కోల్పోయింది.
ఇవన్నీ ఒకెత్తు అయితే.. దేశంలో రాజకీయ ప్రాభవం కోసం, అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఎన్నికల అస్త్రంగా మత పిచ్చి లేపడం ఇప్పటి అసలు సమస్య. ‘మసీదులు తవ్వుదాం.. శవాలు వస్తే మీవి.. శివలింగాలు బయటపడితే మావి’.. ‘కుతుబ్మినార్ను తవ్వుదాం’, ‘తాజ్మహల్ గదులు తెరుద్దాం’.. ఇవ్వాల్టి అధికార ప్రకటిత ఎజెండాలివి. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దేశాన్ని విభజన, విచ్ఛిన్నం వైపు మళ్ళించే ఆచరణలో ఉన్నయి.
‘మందిర్ గిర్తా ఫిర్ బన్ జాతా దిల్ కో కౌన్ సంభాలే.. వో దునియా కే రఖ్వాలే’ అన్నట్టు భారతీయ ఆత్మ ముక్కలవుతున్నది. మనసు ముక్కలవుతున్నది. కశ్మీర్లో కాల్చివేతలు, ఉత్తరప్రదేశ్లో మసీదు-మందిర్, మహారాష్ట్రలో లౌడ్స్పీకర్లు, కర్ణాటకలో హిజాబ్, ఢిల్లీలో బుల్డోజర్, తెలంగాణలో ఉర్దూ.. ఇప్పుడిక మసీదులు తవ్వాలనే ఉబలాటం.. దేశంలో ఇప్పుడు మత పిచ్చి చర్చ తప్ప మరొకటి తీసే పరిస్థితి లేదు. ప్రజల అవసరాలు పట్టించుకున్నవారు లేరు. నోట్ల రద్దుతో ప్రారంభమై అధోగతి పాలైన ఆర్థిక స్థితిగతుల నుంచి ప్రజల మనసు మళ్లించడానికి మతం ఒక తురుపు ముక్క అయ్యింది.
దేశం సుసంపన్నమైనది. అది భాగ్యవంతుల చేతుల్లో బందీ అయ్యింది. అపార వనరులున్నాయి. నీటి వనరులు పుష్కలం. కానీ దరిద్రం కొట్లాడుతున్నది ఎందుకు? మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడొక కొత్త ఎజెండా కావాలి. ఆ ఎజెండా తెలంగాణలో ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధి నమూనాలో సాగాలి. ఒక పద్ధతి ప్రకారంగా ఒకవేపు వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, మరోవేపు డిజిటల్ యుగంలో పారిశ్రామికీకరణ జరగాలి. ఇవన్నీ ఒక ఎజెండాగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నమస్తే తెలంగాణదే.
‘గంగా జమునా తెహజీబ్’కు అత్యద్భుత నమూనా హైదరాబాద్. భారతదేశం భిన్న మతాల కులాల, ప్రాంతాల, భాషల సమాహారం. అందువల్లనే హిందూ-ముస్లిం సంస్కృతుల సమ్మేళనంగా గంగా జెమునా తెహజీబ్ ఉనికిలోకి వచ్చింది. దానికి నమూనా హైదరాబాద్. కానీ మనం కృత్రిమ మేధ సంగతులు మాట్లాడుతుంటే, డిజిటల్ యుగంలో తెలంగాణ ఐటీహబ్ గురించి మాట్లాడుతుంటే, మనం మన బడి మన ఊరు, మన పట్టణం, మన హైదరాబాద్ రస్తాల గురించి మాట్లాడుతుంటే మనం ఈ దేశం అధోగతి నుంచి ఊర్ధముఖంగా ఎట్లా సాగాలో మాట్లాడుతుంటే వాళ్లు మసీదులు తవ్వుతామంటారు. వాళ్లు ప్రతి దాంట్లో మతాన్ని చొప్పిస్తారు. బుల్డోజర్లు, లౌడ్ స్పీకర్లు, తవ్వకాలు వాళ్ల ఎజెండాలు.
అతి పురాకాలం నుంచి సర్వ సంస్కృతులను అక్కున చేర్చుకొని ఆదరించిన తెలంగాణకు ఈ కొత్త ముప్పు పొంచి ఉన్నది. ఇది తెలంగాణకు ప్రమాదకరమైంది. చైతన్యపూరితమైన నేల తెలంగాణ. గంగాజమునా తెహజీబ్ ప్రతీక అయిన హైదరాబాద్ను ఈ మతపిచ్చి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని రాజకీయాల్లోకి ఉద్దేశపూర్వకంగా చొప్పిస్తున్న రాజకీయాలను నిరసించాలి, ఎండగట్టాలి, ఎదిరించాలి.
తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే పరమావధిగా పుట్టిన ‘నమస్తే తెలంగాణ’.. ఈ రెండో దశ నిరంకుశత్వాన్ని, ఆధిపత్యాన్ని, అన్యాయాన్ని ఎదరించడానికి తెలంగాణ గొంతుక కావాలి. ఇది ‘నమస్తే తెలంగాణ’కు మలిదశ ఉద్యమం కావాలి.