యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తున్నది. పైసా ఖర్చు లేకుండా ఇండ్లను నిర్మించి ఇస్తున్నది.గత ప్రభుత్వాలకు భిన్నంగా డబుల్ బెడ్రూం ఇండ్లను విశాలంగా నిర్మించి గౌరవంగా బతికేలా చేస్తున్నది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు పైగా ఖర్చుచేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 997 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉండగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. వారం, పది రోజుల్లో అర్హులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. దశల వారీగా అందరికీ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే పలుచోట్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయగా మరికొన్ని చోట్ల ప్రక్రియ కొనసాగుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 3,620 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసి నిర్మాణాల కోసం టెండర్లు పిలిచారు. ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04, పట్టణ ప్రాంతాల్లో రూ. 5.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వీటిలో ఇప్పటివరకు 997 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావి పనులు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అంతా ఉత్తదే..
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జనం జేజేలు పలుకుతున్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను దేవుడిగా భావిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇండ్లు నిర్మాంచుకోవాలంటే సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోక అప్పులు చేసే పరిస్థితి ఉండేది. దీనికి తోడు దళారులు అందినకాడికి దోచుకునేవారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసిన దాఖలాలూ లేవు, ప్రస్తుతం బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నది. మరోవైపు డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటామని చెబుతున్నారు.
ఇండ్ల నిర్మాణాలు పూర్తయినవి ఇవే..
ఆలేరులో 64 ఇండ్లు, కొలనుపాకలో 6, తుర్కపల్లిలో 40, డి.మల్కానూర్ 72, సర్వేల్లో 64 కలిపి మొత్తం 304 ఇండ్లు పూర్తయ్యాయి. ఆత్మకూరులో 48, మాసాయిపేటలో, మోటకొండూర్లో 40, వంగపల్లిలో 40, ఉప్పలపహాడ్లో 45, సింగన్నగూడెంలో మొదటి దశ-160, రెండో దశ-284, జబ్లిక్పల్లిలో 36 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే కొన్నిండ్లలో చిన్న చిన్న మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి. ఇవి కూడా తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తుది దశలో లబ్ధిదారుల ఎంపిక, డ్రా..
ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. గ్రామ వార్డు సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని తాసీల్దార్ల ద్వారా సర్వే పూర్తి చేశారు. ఈ జాబితాలో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వడబోశారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఆత్మకూరు.ఎం, కొలనుపాక, డి. మల్కాపూర్, సర్వేల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది.
వారంలో పంపిణీకి కసరత్తు..
జిల్లాలోని ఇప్పటికే ఆలేరు, కొలనుపాక, సర్వేలు, డి మల్కాపూర్, తుర్కపల్లి, శివన్నగూడెంలో ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల నిర్మాణాలు, మౌలిక సతుపాయాల కల్పన కూడా పూర్తయ్యింది. నేరుగా గృహ ప్రవేశం చేయడమే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇండ్లును అందించనున్నారు.