గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి, సంక్షేమాలకు నోచుకోని ప్రజలు నానా అవస్థలు పడేవారు. అలాంటిది పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోయిన విషయం విదితమే. ఇక క్రీడల విషయానికి వస్తే పట్టణాల్లోని క్రీడా మైదానాల్లోనే సరైన సౌకర్యాలు ఉండకపోయేవి. ఇక మారూమాల ప్రాంతాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన ప్రాత్సాహం లేక జాతీయ, అంతర్జాతీయ పోటీలకు క్రీడా కారులు వెళ్లలేకపోయేవారు. పాఠశాలల్లో విద్యార్థులకు వసతులే లేకపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆటల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు.
జాతీయ స్థాయిలో గ్రామీణ క్రీడాకారులు..
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో తెలంగాణ క్రీడాకారులు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. దీనికి కారణం గ్రామీణ స్థాయి నుంచి క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడమే కారణం. నేడు మారుమూల గ్రామాల్లో సైతం క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వస్తుండగా, గతం కంటే నేడు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలు ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక మంది క్రీడాకారులు, పోలీస్, మిలటరీ, వ్యాయమ ఉపాధ్యాయ ఉద్యోగాల సాధనకు ఎంతగానో ఉపయోకరంగా ఉన్నాయి.
దేశాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం
ఉద్యమ నాయకుడైన కేసీఆర్కు దేశంలోని రైతులు, ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అన్ని రంగాలపై అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జాతీయ పార్టీ పెడితే బాగుంటుంది. తెలంగాణలో చిన్న చిన్న గ్రామాలు కూడా అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నాయి. క్రీడాకారులకు 2 శాతం స్పోర్ట్స్ కోటా కల్పించారు. గతంతో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారు. దేశం ఎటుపోతుందో అర్థంకాని క్లిష్ట పరిస్థితుల్లో కచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి అవసరం. అది కేసీఆర్తోనే సాధ్యం. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఆయన భవిష్యత్ దిక్సూచిలా కనిపిస్తున్నారు.
-బొమ్మపాల గిరిబాబు, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ నల్లగొండ జిల్లా ప్రధానకార్యదర్శి(నల్లగొండరూరల్)
క్రీడాప్రాంగణాల ఏర్పాటు ఘనత కేసీఆర్దే
తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించారు. ఆట స్థలాలు లేక క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయించారు. దాంతో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మెరిట్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యం ఇస్తుండడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. క్రీడలపై ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులను సీఎం కేసీఆర్ వెన్నుతట్టి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన ఎంతో మందికి సాయం చేసిన మనసున్న మనిషి సీఎం కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలో క్రీడారంగం ఎంతో అభివృద్ధి చెందనున్నది.
-గంగాపురం రాము, ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు
(చిట్యాల)
సీఎం కేసీఆర్తో క్రీడారంగానికి గుర్తింపు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే క్రీడారంగానికి మరింత గుర్తింపు వస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఎంతోమంది జాతీయ క్రీడాకారులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించడానికి ఇప్పటికే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, నియోజకవర్గ స్థాయిలో మినీ స్టేడియం ఏర్పాటు చేయడంతో క్రీడారంగం అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంతకుముందు 1 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను సీఎం కేసీఆర్ 2 శాతానికి పెంచి క్రీడాకారుల అభిమానాన్ని చూరగొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రాంతంతో సంబంధం లేకుండా భారీగా ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే క్రీడాకారులకు మంచి రోజులు వచ్చినట్లే.
– మారబోయిన రామకృష్ణ, జిల్లా బ్యాడ్మింటన్ కోచ్(మిర్యాలగూడ)
కేసీఆర్తోనే దేశం బాగుపడుతది
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతది. దేశ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతో నేడు దేశం అన్ని రంగాల్లో వెనుకబడింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గింది. జాతీయ అధికాభివృద్ధి రేటు ఆశించిన స్థాయిలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 18 శాతం ఉంటే, దేశ ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతం మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు బాగుండడం, మంచి విజన్ ఉన్న నాయకుడు కావడంతోపాటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఆయనతోనే దేశంలో మార్పులు చోటుచేసుకుంటాయి. తక్షణమే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది.
-నాదేండ్ల శ్రీను, వ్యాయామ ఉపాధ్యాయుడు,సీనియర్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు(హాలియా)
గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ పల్లెల్లో సైతం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతది. ఇతర రాష్ర్టాల క్రీడాకారులకు ప్రోత్సాహకం అందించడంతోపాటు సైనిక, రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇది వరకు 1 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండగా, దాన్ని సీఎం కేసీఆర్ 2 శాతానికి పెంచి క్రీడాకారుల మనుసు గెలుచుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రాంతాలతో సంబంధం లేకుండా భారీగా ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహిస్తున్నది మన సీఎం కేసీఆర్ ఒక్కరే. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశ ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం దక్కుతుంది.
– రాపోలు అభిషేక్, వాలీబాల్ క్రీడాకారుడు, దిర్శించర్ల(నేరేడుచర్ల)
స్థానికంగా రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీలు
గతంలో ఎక్కడో రైల్వే సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరుగగా, నేడు అనేక క్రీడా పోటీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జాతీయ క్రీడా పోటీలు అనేది తెలియని పరిస్థితి ఉండగా, గత ఎనమిదేండ్లలో ఉమ్మడి జిల్లాలో అనేక స్పోర్ట్స్ మీట్లు, హాకీ, కబడ్డీ, కత్తి సాము, నేషనల్ బాల్ బ్యాడ్మింటన్, షూటింగ్ బాల్ తదితర పోటీలతోపాటు మారుమూల ప్రాంతమైన సూర్యాపేట జిల్లా నూతనకల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందుకే కేసీఆర్ లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ పాలనాపగ్గాలు చేపడితే క్రీడారంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని, కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన్నట్లయితే దేశం ఖేల్ ఇండియాగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుందని పలువురు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్తో దేశం ఖేల్ ఇండియాగా మారుతుంది
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం ఖేల్ ఇండియాగా అంతర్జాతీయ క్రీడా వేదికలపై సత్తా చాటనున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక మంది గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో తాము ఎంచుకున్న క్రీడల్లో రాణిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తుంది. పట్టణ స్టేడియాలకు దీటుగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం గ్రామీణ క్రీడాకారులకు వరంగా మారింది. పలువురు సీనియర్ క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర క్రీడా అసోసియేషన్లలో పదవులు లభించడంతో వారు రాష్ట్రంలోని పల్లె ప్రాంతాలకు చెందిన మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. దాంతో వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కోదాడ ప్రాంతంలో అనేక మంది కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. కొంత మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
-నామ నరసింహారావు, కబడ్డీ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి(కోదాడ రూరల్)
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడాప్రాంగణాలు
ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నది. క్రీడాకారులు క్రీడాప్రాంగణాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఆయా క్రీడల్లో మరింత పట్టు సాధించగలుగుతున్నారు. అలాగే గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు సైతం క్రీడాకారులు వ్యాయామం కోసం వినియోగించుకుంటున్నారు. అన్ని క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులు క్రీడల్లో మరింత పట్టు సాధించేలా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పేరుగాంచిన కోచ్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. దాంతో క్రీడాకారులు నైపుణ్యాలు పెంపొందించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించగలుగుతున్నారు. గతంలో మన దేశం తరఫున పతకాలు తక్కువ వచ్చేవి. అందులోనూ మనం రాష్ట్రం నుంచి మరింత తక్కువగా ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని వనరులు కల్పిస్తుండడంతో ఇటీవల రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించగలుగుతున్నారు. రాష్ట్ర క్రీడాకారులకు ఇన్ని అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశస్థాయిలోనూ క్రీడారంగం అభివృద్ధికి తిరుగుండదు.
-అమరవరపు సైదులు, పారా కబడ్డీ జాతీయ క్రీడాకారుడు, కల్మల్చెర్వు(గరిడేపల్లి)