గుండు సూది మొదలుకుని గడ్డపార వరకూ, ఆహార పదార్థాలు.. ఆకట్టుకునే కళాకృతులు.. పెద్ద మొత్తంలో గొర్రెలు, మేకలు, పశువుల విక్రయాలు వెరసి చౌటుప్పల్ వారాంతపు సంత ఎంతో పేరొందింది. 1964లో ఏర్పాటైన ఈ సంత 6వ తరగతి సాంఘీక శాస్త్రంలో పాఠ్యాంశమై నేటికీ తన వైభవాన్ని చాటుతున్నది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన ఎంతో మంది వ్యాపారులకు ఉపాధి కల్పిస్తున్నది. జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల ప్రజలు గృహ సంబంధిత వస్తువులను ఇక్కడ అమ్ముకొని ఆదాయం పొందుతున్నారు. ఇక పశువుల క్రయ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. 1990 సంవత్సరంలోనే పశువుల రహదారి వేలం రూ.18లక్షలు పలికి ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది.
దినదినాభివృద్ధి చెందుతున్న చౌటుప్పల్ పట్టణంలో గతంలో చిన్న చిన్న కిరాణాదుకాణాలు ఉండేవి. కాల క్రమంలో వాటి స్థానంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు ఏర్పాటైనా చౌటుప్పల్ సంతకు ఇప్పటికీ ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉంది. అన్ని రకాల వస్తువులు అగ్గువకే దొరుకడంతో పల్లె వాసులు సంతకు వచ్చేందుకు మక్కువ చూపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చౌటుప్పల్ సంత నేటికీ అదే వైభవాన్ని కొనసాగిస్తున్నది. ఆదివారం రోజున సంత నిర్వహించడంతో ఎంతో మంది వ్యాపారులు, ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లలో చౌటుప్పల్ సంతకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇక్కడికి వచ్చి పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తుంటారు.
చర్చనీయాంశంగా రహదారి వేలం…
1990 సంవత్సరంలో చౌటుప్పల్ సంత రహదారి వేలం రూ.18లక్షలు పలికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రహదారి వేలం డబ్బులతోనే చౌటుప్పల్ గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించేవారు. ఈ రహదారి వేలం దక్కించుకునేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి, మహబూబ్నగర్ వ్యాపారస్తులు తీవ్రంగా పోటీపడేవారు. పోలీసుల సమక్షంలో రహదారి వేలం నిర్వహించడం వెనుక సంత రద్దీ, ఆదాయాన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఇక్కడ కొబ్బరి మొక్కలు లభించకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి తెచ్చి చౌటుప్పల్ సంతలో విక్రయించేవారు. మొక్కలను కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలిరావడంతో చౌటుప్పల్ సంత ఫేమస్ అయ్యింది.
ఎన్నికల ప్రచారానికి అడ్డాగా…
ఎన్నికల ప్రచారానికి కూడా చౌటుప్పల్ సంత అడ్డాగా ఉండేది. ఎమ్మెల్యే, ఎంపీ ఇతర ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంతలో విస్తృతంగా ప్రచారం చేసేవారు. సమీప గ్రామాల ప్రజలంతా సంతకు రావడంతో సదవకాశంగా మలుచుకుని వేదికగా వాడుకునేవారు. ఇప్పటికీ ఎన్నికల ప్రచారానికి అడ్డాగా సంతను ఉపయోగించుకుంటున్నారు.
ఇప్పటికీ ఎంతో ప్రత్యేకం…
చౌటుప్పల్ సంతకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అన్ని జిల్లాల నుంచి జనం రాకతోని చాలా సందడిగా ఉంటుంది. పశువుల వ్యాపారులు, సామాన్లు అమ్ముకునే వాళ్లంతా ఇక్కడే వ్యాపారం చేసుకుంటారు.
50 ఏండ్లుగా సంతకు వస్తున్నా..
చౌటుప్పల్ సంతకు ఎంతో పేరుంది. 50ఏండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నా. అప్పుడు మేకలు, పశువులు అమ్మేందుకు అడ్డాగా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో జనం ఇక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్లు. రహదారి వేలానికి మస్తు డిమాండ్ ఉండేది. ఎన్నికలప్పుడు కూడా నాయకులందరూ ఓటు వేయమని సంతకొచ్చి అడిగేవారు.