భువనగిరి కలెక్టరేట్, జనవరి 18 : ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఆసరా పింఛన్ జాబితా ఆధారంగా 18నుంచి 35సంవత్సరాల వయస్సు కలిగిన వారిని ఎంపిక చేయనున్నది. హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీస్(ఎన్ఎస్ఐసీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ)ల్లో 21 కోర్సుల్లో దివ్యాంగులకు శిక్షణ అందించనున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 40శాతం వైకల్యం కలిగి సదరం సర్టిఫికెట్లు పొందిన దివ్యాంగులు 21,902మంది ఉండగా అందులో 18-35సంవత్సరాల మధ్య వయస్సు వారు 4,418 మంది
ఉన్నారు.
నైపుణ్య శిక్షణలో అందించే కోర్సులు…
40శాతం వైకల్యం కలిగి ఉచిత నైపుణ్య శిక్షణకు ఎంపికైన దివ్యాంగులకు 21కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అందులో భాగంగా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, జనరల్ ఫ్లంబర్, పెయింటర్, డెకొరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, టైలర్, చెఫ్ ట్రైనింగ్, బేకరీ పదార్థాల తయారీ, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, అకౌంటింగ్ సర్టిఫికెట్ కోర్సు, ట్యాలీ జీఎస్టీ, మల్టీమీడియా యానిమేషన్, బ్యుటీషియన్, సీసీ టీవీ ఇన్స్టాలేషన్, ఆటోకాడ్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్యాషన్ డిజైనింగ్, పీసీబీ డిజైనింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు.
మూడు నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ..
దివ్యాంగులకు ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్లోని పలు సంస్థల సహకారంతో ఉచిత రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల పాటు ఉపాధి రంగాల్లో శిక్షణను అందించనున్నది. తద్వారా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది.