ఆదిమ మానవుడు నడయాడిన నేల. క్రీస్తు పూర్వం శాతవాహనుల మొదలు ఆధునిక యుగాన మొఘలుల వరకు పరుచుకున్న చరిత్ర. శైవం, బౌద్ధం, జైనం పరిఢవిల్లిన ప్రాంతం. వీర తెలంగాణ నుంచి వేరు తెలంగాణ వరకూ పోరాటాలకు ఊపిరిలూదిన పురిటిగడ్డ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన ఘన చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను, జీవన విధానాన్ని తెలిపే ఆధారాలు, శిలాశాసనాలు ఇప్పటికీ ఏదో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ చారిత్రక వైభవంతోపాటు వర్తమానాన్ని రికార్డ్ చేస్తేనే భావితరాలకు సిసలైన అస్తిత్వ పతాకను అందించగలం. ఆ బాధ్యతను ఇప్పటికే భుజానికెత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మరో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. చైతన్యానికి మారుపేరైన ఎన్జీ కాలేజీ వేదికగా విద్యార్థులు, అధ్యాపకుల భాగస్వామ్యంతో ‘మన ఊరు చరిత్రను మనమే రాసుకుందాం’ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.మూలాల్లోకి వెళ్లి వాస్తవాలను వెలుగులోకి తేవడంతోపాటు మన చుట్టూ జరిగే మహా పరిణామాలకు అక్షరరూపం ఇవ్వాలని కోరారు. తెలంగాణవ్యాప్తంగా నిర్వహించబోయే మహాయజ్ఞానికి స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు.
రామగిరి, మార్చి 29 : ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేసి వెలికితీసేందుకు ‘మన ఊరి చరిత్ర మనం రాసుకుందాం’ కార్యక్రమం చేపట్టినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, రచయిత, కవి, విమర్శకుడు జూలూరి గౌరిశంకర్ తెలిపారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చరిత్ర మూలాలు రాబోయే తరాలకు మనమిచ్చే సంపదని దానిలో భాగమే ‘మన చరిత్ర మనం రాసుకుందాం’ అనే అంశమని అన్నారు. దీంతో గుణాత్మకమైన మార్పు వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న పరిణామంలో ఇది శుభసూచికమని పేర్కొన్నారు.
ఓయూ ప్రొఫెసర్ దూబే 15మంది విద్యార్థులతో 1950-51సంవత్సరంలో శామీర్పేటలో పర్యటించి అక్కడి సామాజిక అంశాలపై రాసిన గ్రంథమే ‘ఇండియన్ విలేజ్'(భారత గ్రామం) పుస్తకం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుస్తకంగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉందన్నారు. ప్రస్తుతం ఆ గ్రంథమే సామాజికమైన శాస్ర్తాలకు, గ్రామీణ ప్రాంతాలపై పరిశోధనకు నిదర్శనంగా నిలిచిందన్నారు. బీఎన్శాస్త్రి సైతం వందల మంది విద్యార్థులతో 1200పేజీలతో ఒక పుస్తకం రాశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన చరిత్ర మనం రాసుకుందాం కార్యక్రమాన్ని ఎన్జీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులకు పరిచయం చేస్తున్నామన్నారు. విద్యార్థులు వారి ఊరిలోని పరిశ్రమలు, చేతి వృత్తులు, రవాణా సౌకర్యాలు, రహదారులు, సిమెంట్ రోడ్లు, వ్యాపారాలన్నింటిని కలిపి సమగ్ర అంశాలతో రాయాలన్నారు.
అదనపు కలెక్టర్, డీపీఓ కీలక భూమిక
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి కీలక భూమిక పోషిస్తారన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల నైసర్గిక స్వరూపం, సామాజిక, ఆర్థికాంశాలను అందిస్తారని, ఇది కొత్త చరిత్ర రాస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ బృహత్ సంకల్పంలో ముందుగా అధ్యాపకులు, కవులు, రచయితలు ఆయా గ్రామాల చరిత్రలపై సమగ్రంగా రాసి పిల్లలకు స్ఫూర్తి కల్పించాలన్నారు. ఆధునిక తెలంగాణ సమాజ నిర్మాణానికి ఎన్జీ కళాశాల స్ఫూర్తిగా నిలువనుందని పేర్కొన్నారు. అన్ని అంశాలతో పూర్తి సమగ్ర చరిత్రను సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పుస్తక రూపంలో ప్రచురిస్తామన్నారు. జిల్లాలో 884 గ్రామాల చరిత్రను ఆయా ప్రాంతాల్లోని పిల్లలే రాస్తారన్నారు.
రాబోయే కాలంలో తెలంగాణలోని 33జిల్లాలకు ఈ వర్తమాన చరిత్ర రికార్డు ప్రేరణ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ వాగ్గేయకారుడు, రచయిత అంబటి వెంకన్న పాడిన ‘నన్ను గన్న పల్లె తల్లి’ అనే పాట ఆలోచింపజేసింది. ఎంవీ.గోనారెడ్డి సభకు హాజరై గౌరీశంకర్, అదనపు కలెక్టర్, డీపీఓ, ఎన్జీ ప్రిన్సిపాల్స్కు పుస్తకాలు బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థి శ్రీజ బియ్యపు గింజ, పెన్సిల్లోని కర్బనంపై గౌరీశంకర్, అదనపు కలెక్టర్ పేర్లు రాసి బహుమతి ఇవ్వగా అభినందించారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ కొల్లోజు చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, సినారె అవార్డు గ్రహీత మునాస వెంకట్, ఎలికట్టె శంకర్రావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సమన్వయకర్తగా తండు కృష్ణకౌండిన్య, తెలుగుశాఖ అధిపతి నిశ్చల, దీపిక, లావేందర్రెడ్డి, అధ్యాపకులు బాల శ్రీను, నందకుమార్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, యాదగిరిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
అకాడమీ నిర్ణయం అభినందనీయం
విద్యార్థుల్లో రచనా శక్తిని వెలికితీసేందుకు సాహిత్య అకాడమీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. విద్యార్థులందరూ ఇందులో భాగస్వాములై నాటి చరిత్రను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంది. చాలా మందికి తమ ఊరి చరిత్రే తెలియదు. అలాంటి వారికి నేడు సాహిత్య అకాడమీ రాసే చరిత్రలు స్ఫూర్తిగా నిలుస్తాయి.
– వనమాల చంద్రశేఖర్, అదనపు కలెక్టర్
చరిత్రను రాయడం అదృష్టంగా భావించాలి
మరుగున పడిన చరిత్రను వెలికి తీసి నేటి తరానికి అందించే చక్కటి అవకాశం. దేశ చరిత్రలో ఎన్నో అంశాలు ఇలా రాసినవే. విద్యార్థులను ఇలాంటి అంశాల్లో భాగస్వామ్యం చేయడంతో కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయి. కళాశాల విద్యార్థులతో వారి గ్రామాల చరిత్రలు రాయించడం అదృష్టంగా భావించాలి.
– ఎంవీ.గోనారెడ్డి, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు
రూట్స్కు నిదర్శనం
చరిత్రలోని అంశాలను తెలిపిన రూట్స్కు నిదర్శనం ఈ కార్యక్ర మం. తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. చరిత్ర అంటే నాటి, నేటి అంశాలకు సాక్ష్యంగా ఉండేది. మన చరిత్రను మనమే రాసుకుందాం అనే నిర్ణయం అభినందనీయం.
– మునాస వెంకట్, సినారె అవార్డు గ్రహీత, నల్లగొండ
నాలో స్ఫూర్తిని కలిగించింది
మన ప్రాంత అంశాలను చరిత్ర రూపంలో రాయాలనే ఆలోచన నాలో గొప్ప స్ఫూర్తిని కలిగించింది. నేటి ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న చరిత్రను తల్లిదండ్రులు, పెద్దవారిని సంప్రదించి ఏవిధంగా రాయాలనే అంశాన్ని అర్థమయ్యేలా చెప్పారు. నేను ఉండే కాలనీలోని అంశాలపై రాసి లెక్చరర్లకు అందిస్తా.
– కె.శ్రీజ, బీకాం, ఎన్జీ కళాశాల
మా ఊరు గురించి రాస్తా
మా ఊరు ఎలికట్టె. ప్రస్తుతం నల్లగొండలో ఉంటున్నాం. ఊరికి వెళ్లి అక్కడ మా తాతయ్య, నాయనమ్మతోపాటు గ్రామంలోని పెద్దవారిని కలిసి గ్రామ చరిత్రను రాస్తా. అలాగే మా కుటుంబంలోని పూర్వీకుల పేర్లు, వారి వంశ చరిత్రను తెలుసుకుంటా.
– కె.సాహితీ, బీఎస్సీ, ఎన్జీ కళాశాల
గొప్ప అవకాశం
మన సాహిత్యం, సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేయడం మంచి ఆలోచన. మన చరిత్ర మనమే రాసుకుందాం అనే కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ఎన్జీ కళాశాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం అభినందనీయం. వారి నిర్ణయం మేరకు మా ఊరి చరిత్రను త్వరలోనే రాసి అందజేస్తా.
– కె.పావని, బీఏ, ఎన్జీ కళాశాల