నల్లగొండ, మార్చి 15 : నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీ వల్లి టౌన్ షిప్)ప్లాట్లకు నిర్వహించిన ప్రత్యక్ష వేలంలో మంచి స్పందన లభిస్తున్నది. మొత్తం 240 ప్లాట్లలో తొలిరోజు 45, రెండో రోజు 28 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించారు. ప్రభుత్వ ధర గజానికి రూ.7వేలు కాగా, గరిష్ఠంగా రూ.8700 వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఈ వేలం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వమే లే అవుట్ చేసినందున ప్లాట్లకు డిమాండ్ వస్తున్నదని తెలిపారు. డిసెంబర్ 22 నాటికి విశాలమైన రోడ్లతో పాటు డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పించనున్నామని వెల్లడించారు. ఈ నెల 17 వరకు వేలం నిర్వహించనున్నందున ప్లాట్లు కావాల్సిన వారు వెంటనే డీడీ చెల్లించి పాల్గొనాలని సూచించారు. ప్లాటు దక్కించుకున్న వారు వారం లోగా 33శాతం డబ్బులు చెల్లించి 45 రోజుల్లోపు మరో 33శాతం, మిగిలిన డబ్బులు 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రాజీవ్ స్వగృహ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, హెచ్ఎండీఏ ఈఈ రమేశ్, హౌజింగ్ పీడీ రాజ్కుమార్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, సీపీఓ బాల శౌరి, వెటర్నరీ జేడీ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారి భిక్షపతి, ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణకుమార్ పాల్గొన్నారు.