ఆత్మకూరు(ఎం), మే 19 : గతంలో పల్లెల్లో ఎటూ చూసినా మట్టి రోడ్లే దర్శనమిచ్చేవి. చిన్నపాటి వర్షం వచ్చినా బురదమయంగా మారేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రతి వీధిలో సీసీ రోడ్డు వేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కృషితో, సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధులతో మండలంలోని పారుపల్లిలో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. నేడు గ్రామంలో ఏటు చూసినా మట్టిరోడ్లు కనుమరుగై సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 లక్షలతో పాటు గ్రామ పంచాయతీ నిధులు మరో 15 లక్షలతో గ్రామంలో 10 చోట్ల సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ సహకారంతో గ్రామంలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. గ్రామాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.25 లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం సంతోషకరం. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– లగ్గాని రమేశ్గౌడ్, సర్పంచ్, పారుపల్లి
గతంలో ఎస్సీ కాలనీలో ఎటు చేసినా మట్టిరోడ్లు ఉండడంతో వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పడ్డాం. నేడు ఆ పరిస్థితి లేదు. గ్రామ సర్పంచ్ సీసీ రోడ్లు నిర్మించడంతో ఇప్పుడు ఎస్సీ కాలనీ మంచిగా, పరిశుభ్రంగా మారింది.
– గొడ్డు కవిత, గ్రామ మహిళ