స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. పండుగ వాతావరణంలో అంబరాన్నంటుతున్నాయి. ఊరూవాడ జాతీయ సమైక్యతను, స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతున్నాయి. ఆరో రోజైన శనివారం సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి పట్టణాల్లో వివిధ శాఖలు, సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
యువతీయువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం పంపిణీ చేసిన మువ్వన్నెల జెండాలు ప్రతి ఇంటిపైనా రెపరెపలాడుతున్నాయి.
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటేలా పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకొంటున్నారు. శనివారం మున్సిపాలిటీలు, విద్య, పోలీస్, యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ప్రదర్శించి ర్యాలీలు నిర్వహించారు.
పలుచోట్ల ఫ్రీడమ్ 2కే రన్ చేపట్టారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో 300 మీటర్ల పొడవున్న జాతీయ జెండాను విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు భువనగిరి ఖిల్లా ప్రాంగణం వరకు ప్రదర్శించారు. గ్రామాల్లో పంపిణీ చేసిన జాతీయ జెండాలను ప్రతి ఇంటిపైనా ఏర్పాటు చేశారు.
గ్రామాల్లో జాతీయ సమైక్యతను చాటుతూ జాతీయభావం ఉట్టిపడేలా స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని గుర్తు చేసుకుంటూ, నినాదాలు చేస్తూ ర్యాలీలు, జెండా ప్రదర్శనలు చేశారు. ఆయా పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.