నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పదవీకాలం వచ్చే జనవరి 4న ముగియనున్నది. ఆ లోపే ఎన్నికలు జరపాల్సిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కూడిన శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే నెల 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. మొత్తం 1,271 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్అఫిషియో సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో వచ్చింది. నామినేషన్ల పర్వం నల్లగొండ కలెక్టరేట్లో కొనసాగనున్నది.
2015 డిసెంబర్లో జరిగిన నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గ మండలి ఎన్నికలు జరిగిన ఆరేండ్లు పూర్తి కావస్తున్నది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఆరేండ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మేరకే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధ్దమైంది. నల్లగొండతో పాటు రాష్ట్రంలో మొత్తం 12 స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొ దలవుతుంది. 23 వరకు స్వీకరణ, 24న పరిశీలన పూర్తి చేస్తారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహారణకు గడువు విధించారు. డిసెంబర్ 10 ఉద యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రతి మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 14న ఓట్ల లెక్కిం పు నల్లగొండలోనే జరుగనుంది. 16న ఎన్నికల ప్రక్రియతో పాటు ఎన్నికల కోడ్ ముగియనుంది.
మొత్తం ఓటర్లు 1,271.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను పరిగణలోకి తీసుకుంటూ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధి ఉంటుంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలోని జడ్పీటీసీ సభ్యు లు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో ఓటర్లుగా ఉంటారు. ఇలా మొత్తం ఓటర్ల సంఖ్య 1,278 కాగా ఇందులో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం 1,271 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 71 మంది జడ్పీటీసీ సభ్యులు, 757 మంది ఎంపీటీసీ సభ్యులు, 19 మున్సిపాలిటీ పరిధిలోని 424 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరు కాకుండా మరో 19 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లుగా నమోదై ఉన్నారు. వీరంతా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకే…
ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. 2,019 మొదట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థ్ధి తేరా చిన్నపరెడ్డి 226 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మొత్తం 1,085మంది ఓటర్లు ఉండగా అందులో 1,073 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు రాగా చిన్నపరెడ్డికి 640 ఓట్లు పోలయ్యాయి. ఇక ఈ సారి ఏకపక్షంగానే ఎన్నికలు ఉండవచ్చని అంచనా. 2019లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయాలు సాధించింది. మూడు జడ్పీ పీఠాలతో పాటు చండూర్ మినహా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.
పెరిగిన గులాబీ బలం
ఇటీవల చండూరు మున్సిపల్ చైర్పర్సన్ కూడా టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల అనంతరం కూడా అక్కడక్కడ గెలిచిన విపక్ష జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారు. దీంతో జిల్లాలో టీఆర్ఎస్ మినహా మిగతా విపక్షాలకు అన్నీ కలిపినా 100 మందికి మించి ఓటర్లు కూడా ఉండకపోవచ్చు. దీంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ్ధిగా ఎవరినీ నిర్ణయించినా గెలుపు అనివార్యమే కానుంది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం ఈ నియోజకవర్గానికి 2015 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. దీంతో అప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మిగిలిన మూడేండ్ల కాలం కోసం 2019లో ఎన్నికలు నిర్వహించగా టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నపరెడ్డి గెలుపొంది ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరేండ్ల గడువు ముగియడంతో తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. టీఆర్ఎస్కు ఉన్న ఏకపక్ష బలం నేపథ్యంలో విపక్షాలు బరిలో నిలుస్తాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.