నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైనవి కూరగాయలు. ఆహారానికి ఇంట్లో బియ్యం రెడీగా ఉన్నా, కూరగాయలను మాత్రం పట్టణంలో అయినా, పల్లెలో అయినా కొనుక్కోవాల్సిందే. ఒక మనిషి సగటున రోజుకు 230 గ్రాముల కూరగాయలు తీసుకుంటారన్నది శాస్త్రీయ అంచనా. ఆ ప్రకారంగా ఉమ్మడి జిల్లా జనాభాకు దాదాపు నిత్యం 800 టన్నుల కూరగాయలు అవసరమని మార్కెటింగ్
అధికారులు చెప్తున్నారు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మన రైతాంగం పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు 250 టన్నుల మాత్రమే ఉంటున్నది. దాంతో దాదాపు 550టన్నుల సరుకును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో వినియోగదారులపై అదనపు భారం పడుతున్నది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటగా
కూరగాయల సాగును ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి సాగును ప్రోత్సహిస్తూ రవాణా, ఎరువులతో కలిపి నారును ఉచితంగా అందిస్తున్నది. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయాలనుకునే వారికి 50 శాతం రాయితీపై మల్చింగ్ సౌకర్యం కల్పిస్తున్నది. దీనిపై రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
నారు ఉచితం..
ఎకరా విస్తీర్ణానికి సరిపడా టమాట నారుకు రూ.8,000 ఖర్చు అవుతుండగా, రైతులు రూ.1500 డీడీ చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 సబ్సిడీని అందిస్తున్నది. అదనంగా రవాణాకు రూ.500, ఎరువులకు మరో వెయ్యి రూపాయలు ఇస్తున్నది. ఇలా 6 రకాల నారును ఉచితంగా అందిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో కూరగాయలకు ఫుల్ డిమాండ్
చుట్టూ నీరున్నా.. కోతులున్నా..!
సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తితే కాలుపెట్టే జాగ కూడా లేనంతగా నీళ్లుండే భూములవి. వరి తప్ప వేరే ఏ పంటా వేయలేమనే చోట ఇద్దరు రైతులు ప్రయోగాత్మకంగా కూరగాయలు సాగు చేశారు. కోతుల బెడద నుంచీ పంటను కాపాడుకుని మంచి దిగుబడి, పొలం వద్దే మార్కెటింగ్తో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయకట్టులోనూ అవకాశం ఉన్నచోట కూరగాయలు సాగు చేయొచ్చని నిరూపిస్తున్నారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం రైతులు భాస్కర్రెడ్డి, సైదులు గౌడ్.
అధికారుల మాట
రైతులు ఇప్పుడు వరి సాగు చేసి, మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. అదే సమయంలో కూరగాయలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంది. యాసంగిలో మంచి ధర కూడా వస్తుంది.
వ్యాపారుల చెప్తున్నది..
జిల్లా కేంద్రాల్లోని మార్కెట్లకే నిత్యం 40 నుంచి 50 టన్నులపైగా కూరగాయలు బయటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పల్లె నుంచి పట్టణానికి రావాల్సిన కూరగాయలు, పట్టణాల నుంచి తిరిగి పల్లెలకు వెళ్తున్న పరిస్థితి ఉంది.
కూరగాయలు.. నిత్యావసర వస్తువుల్లో ఇదే ప్రధానం. గతంలో ఇంటి ఆవరణలోనే అవసరాలకు సరిపడా కూరగాయలను పండించుకునేవారు. కొందరు రైతులు సాగు చేసి అమ్ముకునేవారు. కానీ నేడు అవసరానికి సరిపడా సాగు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోక తప్పని సరిస్థితి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజుకు సుమారు 550 టన్నులకు పైగా కూరగాయాలను దిగుమతి చేసుకుంటున్నారు. వరి సాగు మోజులో కూరగాయలను పక్కకు పెట్టడంతో ధరలు సైతం విపరీతంగా పెరిగి పోయాయి. ప్రస్తుతం కూరగాయలకు మంచి ధరలు ఉండడంతో రైతులు సాగుకు
మొగ్గు చూపుతున్నారు.
రైతులు సంప్రదాయ పంటల సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పలు రాయితీలు, సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 500 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 3వేలు, యాదాద్రి జిల్లాలో 2వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా దిగుబడి లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దాంతో ధరలు మండిపోతున్నాయి.
550 టన్నులకు పైగా దిగుమతి…
ఉమ్మడి జిల్లా ప్రజల అవసరాలకు రోజూ 600 టన్నులకు పైగా వివిధ రకాల కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిందే. సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 230 గ్రాముల కూరగాయలు అవసరం. ఆ లెక్కన జనాభా ఆధారంగా 800 టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయి. జిల్లాలో కొంత సాగవుతున్నప్పటికీ అదనంగా 550 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దాదాపు 65 శాతానికి పైగా ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నాం. ఇందులో సూర్యాపేట జిల్లాకు 175 టన్నులు, నల్లగొండ జిల్లాకు సుమారు 255టన్నులు, యాదాద్రి జిల్లాకు సుమారు 120 టన్నుల కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలోని మార్కెట్కు రోజుకు సుమారు 40 నుంచి 50 టన్నులకు పైగా కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇక అన్ని మున్సిపాల్టీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో దిగుమతి చేసుకునే విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్, గజ్వేల్లోని ఒంటిమామిడి మార్కెట్, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, కర్నూలు ఇలా ఎక్కడ కూరగాయలు ఉన్న దళారులు తీసుకువచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు.
పట్టణం నుంచి పల్లె కూరగాయలు
గతంలో పల్లె నుంచి పట్టణానికి కూరగాయలు వచ్చేవి. కానీ నేడు పట్టణం నుంచే పల్లెకు కూరగాయలు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల నుంచి తెచ్చిన వ్యాపారులు వాహనాల ద్వారా అవసరం ఉన్న చోటికి పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు అన్ని గ్రామాలకూ పంపిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లేవారు వారానికి సరిపడా కూరగాయలను ఒకే సారి కొంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటల్లో కూరగాయల సాగు బెటర్..
వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోవడంతో నష్టపోకుండా కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నది. సబ్సిడీపై 6 రకాల కూరగాయల నారు పంపిణీ చేస్తున్నది. కూరగాయల సాగు చేసే రైతులకు నారుతో పాటు 50 శాతం సబ్సిడీపై మల్చింగ్, వివిధ క్యాటగీరీల ఆధారంగా సబ్సిడీపై డ్రిప్ అందిస్తున్నది. తెలంగాణ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 25రోజుల నాణ్యమైన సంకరజాతి నారును రైతులకు అందిస్తున్నారు. రైతులు నారు కోసం ఏడీహెచ్, సీఓఈ పేరిట డీడీ చెల్లించి ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 7997725378నంబర్లో సంప్రదించవచ్చు.
కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది
మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు వరి సాగు చేసి ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరుతున్నది. రైతులు కూరగాయల సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. కూరగాయల సాగుకు సబిసడీపై నారు అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యాసంగిలో కూరగాయలకు మంచి ధర ఉన్నందున సాగుపై రైతులు దృష్టి సారించాలి.
బోయిన్పల్లి మార్కెట్ నుంచి దిగుమతి..
భువనగిరి పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు తగ్గింది. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్ నుంచి ఎగుమతి చేస్తా. హన్మాపురం, మన్నెవారిపంపు, వీరవెల్లి, బొమ్మలరామారం మండలంలోని మర్యాల, మాచన్పల్లి, చీకటిమామిడి, పక్కీరుగూడెంతో పలు గ్రామాల్లో పండే టమాట, బీరకాయ, బెండకాయ, వంకాయ, సొరకాయ, గోకర అంతంత మాత్రమే. అవి ఇక్కడ జనానికి సరిపోట్లేదు. బోయిన్పల్లి నుంచి కాకరకాయ, బిన్నిస్, చిక్కుడు, మునగ, కీరా, క్యాబేజీ, క్యారెట్, ఆలుగడ్డ, దోసకాయ, బీట్రూట్, ముల్లంగి, ఆకు కూరలను దిగుమతి చేసి పట్టణంలో హోల్సేల్గా అమ్ముకుంటా.
రోజూ 60 కిలోలు అమ్ముతా..
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో రోజూ 60 నుంచి 70 కిలోల కూరగాయాలు అమ్ముతా. పొద్దున్నే వచ్చి వ్యాపారుల దగ్గర కొని, ఆ తరువాత నా అడ్డా దగ్గర అమ్ముకుంటా. గతంలో ఇక్కడే రైతులు పండించిన కూరగాయలను కొని అమ్ముకునేవాళ్లం. కానీ ఇప్పుడు పండిస్తలేరు.