పాలకవీడు, నవంబర్ 9 : తమ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులంతా వరి సాగు చేస్తున్నా ఆ ఇద్దరు రైతులు భిన్నంగా ఆలోచించారు. భూమి కౌలుకు తీసుకుని ప్రయోగాత్మకంగా కూరగాయలు సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కోతుల బెడద ఉంటుందని సహచర రైతులు వారించినా ప్రత్యేక చర్యలు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. పరస్పరం సహకరించుటూ, వ్యవసాయాధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన మునగాల భాస్కర్రెడ్డి, ఉయ్యాల సైదులు.
భాస్కర్రెడ్డి 3 ఎకరాల్లో బెండ, వంగ, పచ్చిమిర్చి, దోస, బీర, కాకర, గోంగూరతోపాటు పచ్చిమిర్చి, బంతి పూలు సాగు చేస్తున్నాడు. సోమయ్య ఎకరం భూమిలో బెండ, వంగ, పచ్చిమిర్చి, బీర, టమాట, గోకర సాగు చేశాడు. వరి సాగులో ఆశించిన ఫలితాలు లేవని, కూరగాయల సాగులోనే అధిక లాభాలు పొందుతున్నామని తెలిపారు.
భాస్కర్రెడ్డి తాను పండించిన కూరగాయలను రహదారి వెంట విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడు.
మునగాల భాస్కర్రెడ్డి తనకు మొదటి నుంచి మెట్టపంటల సాగుపై ఆసక్తి వుండేదని మేళ్లచెర్వు గ్రామంలో తమ బంధువుల వద్ద పొలం కౌలుకు తీసుకొని పత్తి పండించే ఆలోచన చేసినా కానీ, దూర భారం వల్ల ఆ అలోచన విరమించి గుడుగుంట్లపాలెం గ్రామంలో 20 ఎకరాల్లో వరితో పాటు 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పలు రకాల కూరగాయలను పండిస్తున్నట్లు తెలిపారు.
సాగు చేసిన విధానం…
భూమిని ఐదారు సార్లు బాగా దున్ని ముడి జింకు, వేప పిండి, సూపర్ పొటాష్ చల్లి అచ్చుకట్టామని, ఆ తర్వాత బోదెలు చేసుకొని కూరగాయల మొక్కలను, విత్తనాలు నాటించినట్లు రైతులు భాస్కర్రెడ్డి, సోమయ్య తెలిపారు. నీరు రాకుండా పొలం చుట్టూ డోజర్ సాయంతో గాడిని ఏర్పాటు చేసి వారానికొకసారి మాత్రమే నీరందిస్తున్నామని చెప్పారు. కోతుల బెడద ఉన్నా ఒక వ్యక్తిని కాపలా ఉంచడంతో పాటు కుక్కలను పెంచామని, అప్పుడప్పుడు పటాకులు పేల్చడంతో వాటి సమస్య తీరిపోయిందని వివరించారు.
సేంద్రియ ఎరువుల వాడకం..
కూరగాయల సాగులో సేంద్రియ ఎరువులు వాడుతున్నట్లు రైతులు తెలిపారు. వేప నూనె, గోమూత్రం, పశువుల ఎరువు వాడుతున్నట్లు వెల్లడించారు. కూరగాయల సాగు ఆశాజనకంగా ఉన్నదని, వచ్చే ఏడాది మరింత విస్తీర్ణంలో సాగుకు యత్నిస్తామని చెప్పారు. డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో కూరగాయల సాగుకు ప్రయత్నిస్తామని తెలిపారు.