నల్లగొండ, నవంబర్ 7 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి అఖిలపక్ష నేతలతో కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు భూముల సమస్య చాలా కాలంగా ఉన్నందున పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 2005లో నే ఆర్వోఎఫ్ఆర్ చట్టం వచ్చినా అప్పట్లో కొంతమందికి న్యాయం జరగ్గా మరికొంత మందికి పట్టాలు ఇవ్వకపోవడంతో చాలాకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇప్పటి వరకు అటవీపై బతుకుతున్న గిరిజనులతో పాటు గిరిజనేతరులకు హక్కు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సోమవారం నుంచి గ్రామ సభలు నిర్వహించి పోడు భూము హక్కుదారులను గుర్తిస్తామన్నారు. అందులో భాగం గా గ్రామ కమిటీలు వేసి ఆ కమిటీల్లో మూడో వంతు గిరిజనులు, మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది రాజకీయాలకతీతంగా తీసుకోవాల్సిన చర్య కాబట్టి అఖిలపక్ష నేతల సమక్షంలో చర్చిస్తున్నట్లు తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారంతో పాటు, అటవీ భూములు కాపాడుకోవడానికి విపక్షాలందరూ సహకారం అందించాలని కోరగా అందరూ ఆమోదం తెలుపుతూ ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఉత్తమ్కుమార్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, రవీంద్రనాయక్, నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్, నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ పాల్గొన్నారు.