మునుగోడు, నవంబర్ 6 : పంట మార్పిడి విధానాన్ని నమ్ముకున్న ఓ రైతు పాతికేండ్లుగా సత్ఫలితాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తోటి రైతులు ఒకే తరహా పంటల సాగుతో నష్టాలు చూస్తుంటే తను మాత్రం లాభాలు గడిస్తున్నాడు. మునుగోడు మండలం కచలాపురం రైతు నాగం మధుసూదన్రెడ్డి 4 ఎకరాల సొంత భూమితో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. గత ఆగస్టులో ఎకరంలో రూ.82వేల పెట్టుబడితో బంతి సాగు చేశాడు. డ్రిప్ పద్ధతిలో నీరందిస్తూ మంచి దిగుబడి సాధించాడు. ఇటీవల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా 17క్వింటాళ్ల పూలను విక్రయించగా రూ.1.70లక్షలు వచ్చాయి. కార్తీక మాసంలో మరో 40 క్వింటాళ్ల దిగుబడిని ఆశిస్తున్నాడు. దీనికి మరో రూ.4లక్షలు వచ్చే అవకాశముంది. బంతి తరువాత గుమ్మడి సాగు చేస్తానని చెప్పాడు.
కాలపరిమితి దాటగానే..
మూడు ఎకరాల్లో నిమ్మతోట కాపు దశకు చేరుకుంది. మరో మూడు ఎకరాల్లో దోసకాయలు సాగుచేస్తున్నాడు. దీని ద్వారా రూ.4.5లక్షల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు. అర ఎకరంలో మిరప, మరో 30 గుంటల్లో బంతి సాగు చేస్తున్నాడు. బెల్లం, డీకంపోజర్ ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసి పంటకు పిచికారీ చేస్తున్నాడు. పంట కాలపరిమితి ముగియగానే బంతి, గుమ్మడి, కంది, దోస, బీర, అనపకాయ, కాకర వంటి పంటలను మార్చుతూ మంచి ఫలితాలు పొందుతున్నాడు. కూరగాయలు, పూలను ఊకొండి, పలివెల, తాళ్లవెల్లంల, మునుగోడు, సమీప గ్రామాలతో పాటు మాదన్నపేట, ఎన్టీఆర్ నగర్, బోయిన్పల్లి వంటి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు.
మార్కెట్ను బట్టి పంటలు వేస్తా…
మార్కెట్లో ఏ పంటకు గిరాకీ ఉంటే ఆ పంటనే వేస్తుంటా. బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకమాసం.. ఇలా వరుసగా పండుగలు ఉండటంతో బంతిపూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఎకరంలో బంతి నారు వేశా. మూడు నెలలకు ఒకసారి పంట మార్పిడి చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. మా తాత కృష్ణారెడ్డిని చూసే పంట మార్పిడి విధానం అలవాటైంది. తక్కువ ధరకు తాజా కూరగాయలు, పూలు లభిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నేరుగా మా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
పంట మార్పిడితో బహుళ ప్రయోజనాలు
పంట మార్పిడి విధానం పాటించడం వల్ల భూసారం పెరుగుతుంది. సాగునీటి వినియోగం, చీడపీడల ఉధృతి తగ్గుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గి పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయి. ఒక పంటలో నష్టమొచ్చినా మరో పంటలో లాభం పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట మార్పిడి విధానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ కాలపరిమితి పంటలను సాగుచేయాలని రైతులను చైతన్యం చేస్తున్నది.