మావోయిస్టులుగా లొంగిపోయి జన జీవన స్రవంతిలోకి వచ్చిన ఆ ఐదుగురు కలిశారు. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారంతో వస్తున్న ఆదాయంతో సంతృప్తి చెందక బలవంతపు వసూళ్లకు సిద్ధమయ్యారు. సొంతంగా తుపాకులను తయారు చేసుకుని గన్పాయింట్ దోపీడీకి రెడీ అవుతుండగా నిఘా వర్గాల సమాచారంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి శనివారం యాదిగిరిగుట్టలో వారి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
సిటీబ్యూరో, నవంబర్6 (నమస్తే తెలంగాణ) : నలుగురు మాజీ మావోయిస్టులు ముఠాగా ఏర్పడి బలవంతపు వసూళ్లకు పథకం రచిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. ఈ సంఘటన యాదగిరిగిగుట్టలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. నేరేడ్మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. పిట్టల శ్రీనివాస్ అలియాస్ శీనన్న 1994 నుంచి 1996వరకు భార్య పుష్పతో కలిసి జనశక్తిలో పాలకుర్తి, తొర్రుర్ మండలం సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా, వల్లాల నాగ మల్లయ్య అలియాస్ మల్లేశ్, 1986 నుంచి 1990 వరకు రాడికల్ మిలిటెంట్గా, ఆలేరు గెరిల్లా స్కాడ్ సభ్యుడిగా, ఎడవల్లి శ్రీనివాస్రెడ్డి 1991నుంచి 1997 వరకు మోత్కురు, ఆత్మకూర్, గుండాల ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజింగ్ సభ్యుడిగా, గంగాపురం స్వామి కొడకండ్ల, దేవరుప్పల ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. వీరంతా కొన్నేళ్ల పాటు జనశక్తి, పీపుల్స్ వార్ గ్రూపుల్లో పనిచేసి ప్రభుత్వానికి లొంగిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అనంతరం పిట్టల శ్రీనివాస్ బొమ్మలు తయారీ, వల్లాల నాగమల్లయ్య కూలీగా, ఎడవల్లి శ్రీనివాస్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం, గంగాపురం స్వామి డ్రైవర్గా, అశోక్ జీరాక్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.. వీరు చేస్తున్న పనులతో వారికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. దీంతో శ్రమ తక్కువగా ఉండి భారీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కలిశారు. అయితే యాదిగిరిగుట్టతో పాటు రియల్ భూమ్ అధికంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని అక్కడ పేరొందిన వ్యాపారులు, ఇతర సంపన్నుల చిట్టాను రెడీ చేసుకుని వారిని తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం రచించారు. దీని కోసం పిట్టల శ్రీనివాస్ ఎయిర్గన్, ఎయిర్ పిస్తోలును దేశవాళీ తుపాకులుగా మార్చి వాటితో బెదిరించేందుకు సిద్ధమయ్యారు. తుపాకులే గాక సొంతంగా బుల్లెట్లను రూపొందించుకున్నారు. భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్రం పేరుతో వీరు కరపత్రాలు తయారు చేసుకున్నారు. ఇంతలోనే నిఘా వర్గాలకు ఈ మాజీ మావోయిస్టుల కదలికలపై అనుమానం కలగడంతో వెంటనే అప్రమత్తమై రాచకొండ పోలీసులను అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు శనివారం యాదిగిరిగుట్టలో నాగమల్లయ్య ఇంట్లో వీరందరూ సమావేశమైనట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరి వద్ద నుంచి మూడు దేశవాళీ తుపాకులు, బుల్లెట్లు, పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురి అరెస్టు చేశారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. ఈ మాజీ నక్సలైట్లను పట్టుకున్న ఎస్ఓటీ, యాదిగిరిగుట్ట పోలీసులను సీపీ మహేష్ భగవత్ అభినందించి వారికి రివార్డులు అందించారు. సమావేశంలో అదనపు సీపీ సుధీర్బాబు, భువనగిరి-యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ సురేందర్రెడ్డి, ఎస్ఓటీ బృందం పాల్గొన్నారు.
సొంతంగా తుపాకీ తయారీ
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్ చాలా కీలకంగా ఉన్నాడు. అతను సొంతంగా తుపాకులను తయారు చేసే పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. దీంతో అతను ఎయిర్ పిస్టల్, ఎయిర్ రివాల్వర్ను మార్చి వాటిని దేశవాళీ తుపాకులుగా మార్చుతున్నాడు. దీని కోసం ఎయిర్ పిస్టల్, ఎయిర్ రివాల్వర్లను ఆన్లైన్లో కొనుగోలు చేసి వాటితో ఇలా నిజమైన తుపాకులుగా రూపొందిస్తున్నాడు. అంతేగాకుండా సొంతంగా బుల్లెట్లను సైతం తయారు చేస్తుండడం పోలీసులను నివ్వెరపరిచింది. ఇలా తయారు చేసిన తుపాకులతో కొన్ని దోపిడీ ఘటనలకు పిట్టల శ్రీనివాస్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తయారీని చూసి నాగమల్లయ్య తనకు తుపాకీని తయారు చేసి ఇస్తే తనపై దాడికి పాల్పడే శత్రువులను ఎదుర్కోవ డంతో పాటు తన కూతురి వివాహానికి సంబంధించిన విషయంలో సైతం గొడవులు ఉండడంతో తుపాకీని ఉపయోగించి వారిని బెదిరిస్తానని నిర్ణయించుకున్నాడు. అయితే తుపాకీ తయారీకి ఐదు లక్షలు ఇవ్వాలని పిట్టల శ్రీనివాస్ అడిగినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
భయం పుట్టించేందుకు ముందుగానే రెక్కీ
ఈ మాజీ మావోయిస్టులు తమ గన్పాయింట్ బెదిరింపులతో లూటీ కోసం ఇప్పటికే కొంత మందిని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వారి కదలికలు, వారి రోజు వారి వ్యవహారాలపై సమాచారం సేకరించుకున్నారని తెలిసింది. ఇలా సేకరించిన సమాచారం మీరు ఏ రంగు కారులో వెళ్ళారు, ఆ కారు నెంబరు ఇదే.. మీ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు నెంబరు ఇది, ఆ కారు నంబరు ఇది, వారు వేసుకున్న దుస్తుల రంగు ఇవి అంటూ వివరాలను చెప్పి వ్యాపారుల్లో, సంపన్నుల్లో ఓ భయాన్ని పుట్టించి లక్షలాది రుపాయలను వసూలుకు స్కెచ్ వేశారు. కానీ నిఘా వర్గాలు పసిగట్టడంతో వీరి బెదిరింపు వసూళ్లకు బ్రేక్ పడింది.