బొడ్రాయిబజార్,/సూర్యాపేటసిటీ/తుంగతుర్తి/ నాగారం/ కోదాడ టౌన్/నేరేడుచర్ల, డిసెంబర్ 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఎన్నో అత్యున్నతమైన పదవులు అధిరోహించి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన కొణిజేటి రోశయ్య మృతికి శనివారం జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు ఘన నివాళులర్పించారు. 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడిన మహనీయుడని కొనియాడారు. సూర్యాపేటతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇక్కడి సీనియర్ నాయకుడు, స్వర్గీయ మీలా సత్యనారాయణ, మొరిశెట్టి సత్యనారాయణలతో ఎంతో అనుబంధం కలిగిన రోశయ్య పట్టణానికి ఏ కార్యక్రమానికి వచ్చినా అది ముగిసేంత వరకు ఉండేవారు. ఆర్యవైశ్యులకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో.. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈగ దయాకర్, ప్రధాన కార్యదర్శి మిర్యాల శివకుమార్, నూకా వెంకటేశం గుప్తా, సవరాల సత్యనారాయణ, గోపారపు రాజు, బిక్కుమళ్ల వెంకటేశ్వర్లు, బొల్లం సురేశ్, గుడిపాటి రమేశ్, బోనగిరి విజయ్కుమార్, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు.
రోశయ్య జీవితం అందరికి ఆదర్శం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రోశయ్య అందించిన సేవలు మరువలేనివని, ఆయన జీవితం అందరికి ఆదర్శమని నాయకులు అన్నారు. రాజకీయ భీష్ముడిగా పేరొందారన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సంతాప కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిది చకిలం రాజేశ్వర్రావు, వాణిజ్యసెల్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ కెక్కిరేణి శ్రీనివాస్, తుంగతుర్తి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు తాటికొండ సీతయ్య, హుజూర్నగర్, నేరేడుచర్ల పట్టణాల్లో ఆర్యవైశ్య సంఘం వాసవి, వనిత క్లబ్ సభ్యులతో పాటు కల్నల్ సంతోష్బాబు తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, మేళ్లచెర్వులో ఎంపీపీ కొట్టే పద్మాసైదేశ్వర్రావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మఠంపల్లి, పాలకవీడులో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఎంపీపీ గోపాల్, కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వర్రావు పాలొన్నారు.