ఒమిక్రాన్ సైరన్ మోగింది. కర్ణాటకలో మొదటి సారిగా ఈ వైరస్ సోకింది. వైరస్ ముప్పు పొంచి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలు
పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. మాస్క్ లేకుండా ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1000 జరిమానా వేయాలని నిర్ణయించింది. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కొవిడ్ రెండు డోసుల టీకా తప్పని సరి అనే నిబంధనలు పెట్టింది.
నాగర్కర్నూల్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగా ణ) : ఒమిక్రాన్ వేరియంట్పై ముందస్తు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కరోనా రెండు దశల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆర్థిక నష్టాలు చవిచూశారు. ఇది మరవకముందే ఒమిక్రాన్ రూపంలో థర్డ్వేవ్ ము ప్పు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్ దేశంలో కి ప్రవేశించింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ను అప్రమత్తం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. నాలుగైదు నెలలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు మాస్క్, శానిటైజర్, భౌతికదూరం నిబంధనలు మరిచారు. బహిరంగంగా మాస్కులు పెట్టుకోకుండా భయం లేకుండా తిరుగుతున్నారు. బస్సులు, సినిమా హాల్, హోటళ్లలో నిబంధనలు పాటించడం మరిచారు. కాగా, ఒమిక్రాన్ రూపంలో మరోసారి ముప్పు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇకపై బయటకు వస్తే కచ్చితంగా మాస్క్ ధరించాలని, లేకుంటే రూ.1000 జరిమానా విధించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇది భయంకర వైరస్ నుంచి రక్షించేందుకేనని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మాస్క్ ధరించాల్సిందే. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. వేలాది మంది ప్రజలు టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే రెండో దశ కరోనాతో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ నెలాఖరుకల్లా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గ్రామ స్థాయిలో టాంటాం ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించనున్నది. వైద్యశాఖ సిబ్బందికి ప్రజాప్రతినిధులు సహకరించాలని ప్రభుత్వం సూచిస్తున్నది. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా దవాఖానల్లో బెడ్లను, ఆక్సిజన్ సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నది. అత్యధిక సంఖ్యలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయనున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి విద్యార్థికీ మొదటి, రెండో డోసు పూర్తయ్యేలా శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వ్యాక్సినేషన్పై అనవసర ఆందోళనలు చెందొద్దని సూచిస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 6,72,625 మంది జనాభా ఉండగా.. ఇప్పటి వరకు 90 శాతంతో 5,54,492 మంది మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోసును 30 శాతంగా 1,65,659 మంది తీసుకున్నారు. ప్రజలు బయటకు వెళ్తే వ్యాక్సిన్ సర్టిఫికెట్ సైతం చూపించాల్సి ఉంటుంది. ప్రజలు ఆందోళన చెందకుండా కరోనా నిబంధనలు పాటించడంతో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి.
సరిహద్దుల్లో కరోనా పరీక్షలు
కృష్ణ, డిసెంబర్ 3 : ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మెడికల్ ఆఫీసర్ శ్రీమంతు తెలిపారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు అయిన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ పంచాయతీ పరిధిలో ఉన్న చెక్పోస్టు వద్ద కలెక్టర్ హరిచందన ఆదేశాల మేరకు శుక్రవారం కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీవో శ్రీనివాసులు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోకి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అవసరమైన మందులు పంపిణీ చేస్తామన్నారు.
ఆందోళన వీడండి..
ప్రజలు కరోనా నిబంధనలు తప్పసరిగా పాటించాలి. కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యంగా
వ్యవహరించడం సరికాదు. ఆఫీసులు, ఆరుబయట, సినిమా హాళ్లు, ప్రయాణాల్లో ఇలా ఎక్కడ ఉన్నా మాస్క్ ధరించాల్సిందే. మొదటి, రెండో డోసు టీకాలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే కరోనా ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.