Telangana | వాళ్లిద్దరూ అమ్మాయిలే.. వరుసకు వదినా మరదళ్లు. ప్రకృతికి విరుద్ధమైనప్పటికీ ఇద్దరి మనసులు కలిశాయి. పెండ్లి చేసుకుని ఒకరితో మరొకరు జీవితం పంచుకోవాలని అనుకున్నారు. పెద్దలను ఎదురించి ఒక ఇంట్లో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ వీరిలో ఒక అమ్మాయి అనుమానస్పదంగా మరణించగా.. మరో అమ్మాయి తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మంచిర్యాల జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అంజలి, మహేశ్వరి ఇద్దరూ వరుసకు వదినా మరదళ్లు. వీరిలో మహేశ్వరికి చిన్నతనం నుంచి అబ్బాయిల లక్షణాలు ఉండేవి. అబ్బాయిలాగే వేషధారణ చేసుకునేది. ఈ క్రమంలోనే వరుసకు మరదలు అయిన అంజలిని మహేశ్వరి ఇష్టపడింది. అంజలి కూడా మహేశ్వరి ప్రేమించింది. ఇద్దరి మనసులు కలవడంతో పెండ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఒక రూం అద్దెకు తీసుకుని కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమోగానీ.. వీరిద్దరూ బుధవారం రాత్రి రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిద్దరినీ మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అంజలి మృతిచెందింది. మహేశ్వరి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. కాగా, ఇటీవల మహేశ్వరితో అంజలి సరిగ్గా ఉండకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. ఈ గొడవ విషయంలో బుధవారం వీరిద్దరితో మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వీళ్లిద్దరూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించారా? లేదా ఎవరైనా హత్యాయత్నం చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.