భైంసా, జూన్, 18: మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలతో పాటు భైంసా మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేసేందుకు గాను రూ.432 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంటెక్వెల్స్ పైపులైన్లు, నీటి శుద్ధీకరణ కేంద్రాలు, సంపులు, తదితర నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు.
ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయడంతో పాటు నియోజకవర్గంలోని 349 అంగన్వాడీ కేంద్రాలు, 319 పాఠశాలలు, 175 వైకుంఠధామాలు, 42 రైతు వేదికలు, దేవస్థానాలకు నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. అనంతరం మిషన్ భగీరథ కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్బాబు, వైస్చైర్మన్ జేకే పటేల్, డీఎల్పీవో శివకృష్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్హైమద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భీంరావ్, రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.